TSRTC | సారంగాపూర్, మార్చి 5 : ఆర్టీసీ అదనపు ఆదాయానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కార్గో ద్వారా వస్తువులు చేరవేస్తూ.. తీర్థయాత్రలు, పెండ్లిళ్లకు బస్సులను అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం పొందుతున్నది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. వృథాగా, ప్రయాణికులురాని ప్రయాణ ప్రాంగణాల్లో పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. ఆయిల్ కంపెనీ ప్రతినిధులు కూడా పరిశీలించారు. కాగా.. బంకులు మూడు రకాలుగా ఉండనున్నాయి. ఇందులో పూర్తిగా కంపెనీలకు అప్పగించి అద్దె రూపంలో తీసుకోవడం, ఆర్టీసీ ద్వారానే బంకు నిర్వహించుకోవడం, ప్రైవేటు అవుట్ లెట్ల మాదిరి నడిపించాలని భావిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల బస్స్టేషన్లు వృథాగా ఉంటున్నాయి. గ్రామా ల మధ్యలో రోడ్డు పక్కనే ఉన్నా.. ప్రయాణికులు రాక వెలవెలబోతున్నాయి. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతున్నది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్స్టేషన్ లు, అందులో నిర్మించిన గదుల వల్ల ప్రయోజనం ఉండ డం లేదు. చాలా చోట్ల ప్రయాణికులు ఉన్న చోట బస్టాండ్లలో గదులు అద్దెకు ఇస్తున్నారు. హోటల్స్, పండ్ల దు కాణాలు, జనరల్ స్టోర్స్ వంటి ఇతరత్రా వ్యాపారాలు చే సుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పడు ప్రయాణికులు రాకపోవడంతో మూలనబడ్డాయి. దీంతో ఆర్టీసీకి ఆదాయం రావడం లేదు. ఇలాంటి స్టేషన్లను ఆదా యం వచ్చే ఇతర అవసరాలకు ఉపయోగించాలనే ఉద్ధేశంతో బంకులకు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది బంక్లకు ప్రతిపాదనలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇందులో నిర్మల్ జిల్లా పరిధిలో ముథోల్, భైంసా.. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఆసిఫాబాద్, కాగజ్నగర్.. మంచిర్యాల జిల్లా పరిధిలో చెన్నూర్, మందమర్రిలలో బంకుల ఏర్పాటునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో చెన్నూర్లో మాత్రమే పెట్రోల్ బాంక్ మంజూరై పనులు కొనసాతున్నాయి. కొన్ని బస్స్టేషన్లలో వాటి పరిధిలోని ఖాళీస్థలాలు, మరికొన్ని బస్స్టేషన్లలో స్థలాలు లేకుంటే బయట ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రతిపాదనలు పంపించారు. బంకులు మంజూరు అయితే ఆర్టీసీకి ఆదాయం సమకూరనుంది. బస్స్టేషన్లలో బంక్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని నిర్మల్ డిపో డీఎం సాయన్న పేర్కొన్నారు.