ఎదులాపురం, ఫిబ్రవరి 12 : వరుస దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి గ్రామపంచాయితీ, నాగాపూర్ గ్రామానికి చెందిన టేకం రామారావు అలియాస్ తుకారాంపై 36 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతంలో కరీంనగర్, సిద్దిపేటలలో దొంగతనాలకు పాల్పడి రెండేండ్ల జైలు శిక్ష అనుభవించాడు. జనవరి 6న విడుదలై మళ్లీ ఉట్నూర్ మండలంలో ఏడిళ్లలో దొంగతనం చేశాడు.
గురువారం ఉదయం దొంగిలించిన బంగారం, వెండితో మంచిర్యాల వైపు పారిపోతుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సమావేశంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై గుంపుల విజయ్, పోలీస్ సిబ్బంది శ్యామ్రావు, నరేశ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.