జైనథ్, మార్చి28 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం జైనథ్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి గ్రామానికీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అభివృద్ధికి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించేందుకు 970 ఇంగ్లిష్ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ను అందించిన ఘనత సీఎం కేసీఆర్దేన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్,బీజేపీలు ప్రజలను దోచుకున్నారే తప్ప.. వారికి చేసిందేమీ లేదన్నారు. జన్ధన్ పేరిట మహిళల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని మోసం చేశారని, యేటా 2 కోట్ల ఉద్యోగాలిప్పిస్తామని మాట తప్పారని మండిపడ్డారు.
వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను ముప్పతిప్పలు పెట్టిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో 1500 మందికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ. 3 లక్షలు అందిస్తామని చెప్పారు. అనంతరం జడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేని బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జోగు రామన్నకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీలు తాటిపెల్లిరాజు, కుమ్ర సుధాకర్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఆర్. రమేశ్, మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఊశన్న, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తంయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.
త్వరలో పోడు భూములకు పట్టాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, పథకాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. బేల మండలం పొనాల గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే బీజేపీకి మింగుడు పడడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం రూ.400 ఉన్న వంట గ్యాస్ ధరను రూ.1200కు పెంచిందని, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కట్టుబెడుతుందని ఆరోపించారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎంపీ సోయంబాపురావు ఎప్పుడైనా గ్రామాలకు వచ్చారా అని ప్రశ్నించారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో పట్టాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లైబ్రరీ చైర్మన్ రాహుత్ మనోహార్, పార్టీ అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ రగుకుల్ రెడ్డి, నాయకులు గంభీర్ఠాక్రె, సతీష్ పవార్, దేవన్న, మధూకర్, బిపిన్, ఇంద్రశేఖర్, మంగేశ్, గొడం సునీల్, మెట్టుప్రహ్లాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.