చెన్నూర్, మే 31 : బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను హైదారాబాద్లో అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కుతున్నదని ఆరోపించారు.
సింగరేణిలో అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో మంత్రి వివేక్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తెలిపారు. బాల్క సుమన్ను ఎన్ని రోజులు నిర్బంధిస్తే అన్ని రోజులూ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొప్పుల ప్రభాకర్, ఇమ్రాన్, రైతు సమన్వయ సమితి మాజీ మండల కన్వీనర్ రత్న సమ్మిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రేవెల్లి మహేశ్, మేడ సురేశ్రెడ్డి, మానిశెట్టి శ్రీనివాస్, జోడు శంకర్, దోమకొండ అనీల్, రుద్రబట్ల సంతోశ్, ఆరీఫ్, నయాబ్, బోగె భారతి, తిరుపతి సురేశ్, రాదండి మురళీ, పెద్దల వెంకటేశ్, బుర్ర రాకేశ్గౌడ్, అయిత సురేశ్రెడ్డి, పెద్దింటి రాజన్న పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
కోటపల్లి, మే 31 : సింగరేణిలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అరెస్ట్ చేస్తారా.. అంటూ కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి నం.63 పై రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ సింగరేణిపై బాల్క సుమన్ మాట్లాడిన మాటలను వక్రీకరించారని, సింగరేణిలో అవినీతిని తుడిచి వేయాలనే ఉద్దేశంతో బాల్క సుమన్ మాట్లాడితే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రగతి భవన్ను పేల్చేస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్షార్హుడు కానప్పుడు.. బాల్క సుమన్ ఎలా శిక్షార్హుడు అవుతారని ప్రశ్నించారు.
దళిత నేతలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం ఈ సర్కారుకు మామూలై పోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలనకు సమయం దగ్గర పడుతుందని, తొందరలోనే కేసీఆర్ సారథ్యంలో మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, పారుపల్లి సర్పంచ్ తోగురు శ్రీనివాస్, నాయకులు కొట్టె నారాయణ, ఆసంపల్లి సంపత్, పిల్లి సమ్మయ్య, పూరెళ్ళ సతీశ్, మహేశ్, కామ శ్రీనివాస్, సాదీక్, గుగ్లోత్ బాపు నాయక్ పాల్గొన్నారు.