ఎదులాపురం, అక్టోబర్ 29 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం. నా బలగం.. అని వారి కృషి ఎన్నడు మరువలేనిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో సాగిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో విశేష కృషి చేస్తున్న కార్యకర్తలను ఎన్నటికీ మరువబోమన్నారు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని ఉన్నత పదవులు దక్కినా కార్యకర్తల కృషి మరువ లేనిదని పేర్కొన్నారు. వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటానని భావోద్వేగంతో మాట్లాడారు. మంత్రి హరీశ్రావు పాల్గొన్న సభలో మైదానం పూర్తిగా నిండి బయట నిలబడి ప్రసంగాన్ని విన్నారన్నారు.
ఇటీవల జరిగిన కేంద్ర హోం మంత్రి అమిత్షా సభకు ఉమ్మడి జిల్లా నుండే కాకుండా నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి జనాలను తరలించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులు లేరని హరీశ్రావు పాల్గొన్న సభ చాటి చెప్పిందన్నారు. సోమవారం జైనథ్ లోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మండలంలో ప్రచారాన్ని విస్తృతంగా చేపడతామన్నారు. కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజ య్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్ పాల్గొన్నారు.