ఆసిఫాబాద్, డిసెంబర్ 7 : ఆసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి జైకొట్టారు. నియోజవర్గంలో 2,26,664 ఓట్లు ఉండగా.. ఇందులో 1,83,534 ఓట్లు పోలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ ఓట్లలో అత్యధికంగా ఆదివాసీ తెగలకు చెందిన వారు బీఆర్ఎస్కే ఓటేసి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్ లంబాడా తెగకు చెందిన వ్యక్తి కావడంతో ఆదివాసీ తెగకు చెందిన కోవ లక్ష్మికి ఏజె న్సీ గ్రామాలు అండగా నిలిచాయి.
కెరమెరి, సిర్పూర్(యు), గాదిగూడ, జైనూర్, తిర్యాణి మండలాల నుంచి మెజార్టీ ఓట్లు పడ్డాయి. అత్యధికంగా సిర్పూర్(యు), అతి తక్కవగా ఆసిఫాబాద్ మండలంలో మెజార్టీ వచ్చింది. కోవ లక్ష్మి కూతురు కోవ అరుణ జడ్పీటీసీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సిర్పూర్(యు) మండలం నుంచి 5,389 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండో స్థానంలో కోవ లక్ష్మి జడ్పీటీసీగా ప్రాతినిథ్యం వహిస్తున్న జైనూర్ మండలం నుంచి 4,646 ఓట్లు వచ్చాయి.
సొంత మండలమైన తిర్యాణి నుంచి 3,701 ఓట్ల మెజార్టీ వచ్చింది. గాదిగూడ మండలం నుంచి 3,686, ఆమె అమ్మగారి మండలం వాంకిడి నుంచి 2,221, లింగాపూర్ 1,976, రెబ్బెన 753, కెరమెరి 594, నార్నూర్ 77,అసిఫాబాద్ 33 మంది ఓట్ల మెజార్టీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 10 మండలాల్లోనూ మంచి మెజార్టీ వచ్చింది.
ఆసిఫాబాద్ నియోజవర్గంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. పొడు పట్టాలు, రైతు బంధు, రైతుబీమా వంటివి కలిసొచ్చాయి. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు పొందుతున్న వారు బీఆర్ఎస్ వైపు నిలిచారు. అంతేకాకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబం ధు, బీసీ, మైనార్టీ రుణాలు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు బీఆర్ఎస్కు మేమున్నామని అండగా నిలిచారు. మిషన్ భగీరథ నీరు ఏజెన్సీ గ్రామాల్లో చెరగని ముద్ర వేసింది. విద్యలో వెనుక బడ్డప్పటికీ ఇక్కడి ప్రజల ఆలోచన విధానం మాత్రం ముందంజలో ఉంటుందని నిరూపించారు. పని చేసేవారికే అధికారం ఇవ్వలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపారు.