ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా.. హుషారుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. పల్లెలు, పట్టణాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. వాడలు, కాలనీలు గులాబీ సంద్రంగా మారుతుండగా.. పండుగ వాతావరణం నెలకొంటున్నది. ప్రజాప్రతినిధులు తమ ప్రసంగాలతో జోష్ నింపుతుండగా.. జై తెలంగాణ.. జైజై బీఆర్ఎస్ నినాదాలు మార్మోగుతున్నాయి. కాగా.. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మేళనానికి మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్లు.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పవాడ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/జైనూర్, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం కేంద్రం గులాబీ సంద్రమైంది. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. మార్కెట్ ఏరియా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది ద్విచక్రవాహనాలపై తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్లు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు, పార్టీ నాయకులతో సభా స్థలి కిక్కిరిసింది. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ నినాదాలతో ఆత్మీయ సమ్మేళన ప్రాంగణం హోరెత్తింది.
ఆత్మీయ సమ్మేళనాలపై కేటీఆర్ ఆరా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జైనూర్లో ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ నుంచి జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మన్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనం సభ నుంచి పక్కకు వెళ్లి వాళ్లు కేటీఆర్తో మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనాలకు జన స్పందన ఎలా ఉంది? కార్యకర్తలు, నాయకులు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారా? ప్రజల స్పందన ఏమిటనే విషయాలపై కేటీఆర్ ఆరా తీశారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి
– మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. జైనూర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడం గొప్ప విషయమన్నారు. దేశ ప్రజలను వంచిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్లు పాదయాత్రల వంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వచ్చి తప్పుదోవ పట్టిస్తున్నాయని.. ప్రజలు వారి మాటలు నమ్మవద్దన్నారు.
ఇంటింటికీ సంక్షేమాన్ని అందించింది కేసీఆరే..
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. రాబోయే కాలంలో అదనంగా అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మాయ మాటలతో గ్రామాల్లోనికి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను ప్రజలు తరిమికొట్టాలన్నారు. ప్రగతి ప్రదాతకే మళ్లీ పట్టం కట్టాలని సూచించారు.
త్వరలో పోడు సమస్యకు పరిష్కారం
– ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి
బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుం టున్నదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు నాయకత్వం ఆలోచిస్తున్నదని, పార్టీకి అండగా ఉండేవారికి పార్టీ కూడా అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
ప్రతి ఇంట్లో లబ్ధిదారులున్నారు..
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
సంక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారులు ప్రతి ఇంట్లో ఉన్నారు. బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలి. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పేందుకు వచ్చే ప్రతిపక్ష పార్టీ నాయకులను తరిమికొట్టాలి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటాం. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలను న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇది ఎన్నికల సంవత్సరం కనుక ప్రతి కార్యకర్త పార్టీకి అండగా ఉండాలి.