జైపూర్, ఏప్రిల్ 12: బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన 20 గ్రామాల ఆత్మీయ సమ్మేళనానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా జైపూర్ జైత్రయాత్ర కనపడుతున్నదని హాజరైన జనాన్ని చూసి విప్ సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటాలు, బైక్ ర్యాలీలతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బాల్క సుమన్ నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది.
కార్యక్రమంలో విప్ సుమన్ మాట్లాడుతూ.. నాలుగేండ్ల కాలంలో రూ.1,354 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ. 3 కోట్లతో పెగడపల్లి జైపూర్ మధ్యలో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు మొదలైనట్లు వివరించారు. రూ.3.25 కోట్లతో గంగిపెల్లి వద్ద బ్రిడ్జి, రూ.3.50 కోట్లతో మద్దెలపల్లి కుందారం మధ్యలో బ్రిడ్జి, రూ.1.50 కోట్లతో కుందా రం వద్ద బ్రిడ్జి, రూ. 3 కోట్లతో ఈదులవాగుపై బ్రిడ్జి, రూ. 6.97 కోట్లతో రసూల్పల్లి వద్ద బ్రిడ్జి, జైపూర్లో రూ. 2.8 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఇందారంలో రూ. 4.70 కోట్లతో సెంట్రల్ లైటింగ్ రాష్ట్ర రహదారి సుందరీకరణ పనులు, రూ. 2.80 కోట్లతో రామారావుపేట చెరువుకట్టపై డబుల్రోడ్డు, రూ. 37 కోట్లతో ఇందారం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు. రూ.4.61 కోట్లతో 11 కిలోమీరట్ల మేర కుందారం నుంచి పౌనూర్ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.1.61 కోట్లతో రసూల్పల్లి గుడిపెల్లి బీటీ రోడ్డు పూర్తి చేసినట్లు వివరించారు. మిషన్ కాకతీయతో రూ.6.26 కోట్లతో 48 చెరువులు పూడికతీత చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో చెన్నూర్లో ఎత్తిపోతల పథకానికి రూ.1,658 కోట్లతో త్వర లో భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను వివరించారు.
జైపూర్ ప్రజల త్యాగాలతోనే విద్యుత్ కేంద్రం, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణమయ్యాయని తెలిపారు. పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారని తెలిపా రు. ఏ రాష్ట్రంలోనూ అమలు కాని పథకాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మనకు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలననందిస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దామని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేటలకు దీటుగా స్థానిక ఎమ్మెల్యే సుమన్ అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడారు.
రానున్న ఎన్నికల్లో సుమన్ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సుమన్ క్యాబినెట్ మినిస్టర్ అవుతారని జోస్యం చెప్పారు. గత 50 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా చెన్నూర్లో అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, మన రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, డీసీసీబీ చైర్మన్ తిప్పని లింగయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కొంగల సత్యనారాయణ, జడ్పీటీసీ మేడి సునిత, ఎంపీపీ గోదారి రమాదేవి, పార్టీ మండలాధ్యక్షుడు అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ భీమారం మండలాధ్యక్షుడు అయిలి నరందర్ పటేల్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు విప్ బాల్క సుమన్ పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. నియోజకవర్గంలో విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, పని చేసే నేతకు అండగా ఉండేందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.