ఎదులాపురం, ఫిబ్రవరి 4 : యువతకు ఉజ్వల భవిష్యత్ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఐటీ టవర్కు పరిపాలన అనుమతులు మంజూరు కావడంపై బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ చౌక్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జోగు రామన్న’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఐటీ కార్యకలాపాల విస్తరణకు ప్రత్యేక చొరవ చూపడంతో ఎంతో మంది యువతకు ఉపాధి లభించే ఆస్కారం ఉందని తెలిపారు. మహా నగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ఆదిలాబాద్కు తీసుకురావడంలో ఎమ్మెల్యే జోగు రామన్న విశేష కృషి చేశారని వెల్లడించారు. యువతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, సాయికుమార్, ఖయ్యూం, ఇబ్బు, హలోక్, అభిలాష్, అజయ్, అబుజర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.