ఆదిలాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) ;ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది. ఏ ఊరికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, గెలుపు ధీమా వ్యక్తమవుతున్నది. మంగళవారం నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి, జాన్సన్ నాయక్, జోగు రామన్న, అనిల్ జాదవ్ పర్యటించగా, అనూహ్య స్పందన వచ్చింది. ప్రభుత్వం పదేళ్లలో సాధించిన ప్రగతి, మ్యానిఫెస్టో గురించి వివరించి ఓట్లు అభ్యర్థించగా, ఆయా వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించింది.
నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ సైన్యం గెలుపే ధ్యేయంగా పల్లెపల్లెనా పర్యటిస్తున్నది. ఇంటింటికీ వెళ్లి పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తుండగా, ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ముథోల్ నియోజక వర్గ అభ్యర్థి జీ విఠల్ రెడ్డి, కడెం మండలంలో ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, దస్తురాబాద్ మండలంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో బేల, జైనథ్ మండలాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, నేరడిగొండ మండలంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు.