నిర్మల్ అర్బన్, నవంబర్ 9 : రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సభ్యులు, ముఖ్యనాయకులు, తన అనుచరగణంతో కలిసి ప్రచార రథంలో ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరారు.
ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలనే ఫణంగా పెట్టి, సాధించారని పేర్కొన్నారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో 100 సీట్లకుపైగా బీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు నమ్మశక్యం కాని హామీలతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తన హయాంలోనే నిర్మల్ జిల్లాను తీసుకొచ్చామని, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను తీసుకొచ్చామని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చామని, 27వ ప్యాకేజీ ద్వారా నీటిని వదులుకున్నామని తెలిపారు.
అభివృద్ధి చేసిన పార్టీలకే రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతున్నారని ఏ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుంది, ఏ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాడో గమనించాలని సూచించారు. ఈనెల 30న జరిగే పోలింగ్లో నియోజకవర్గ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే, సీఎంగా కేసీఆర్ను మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ వేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలు, మండలాలు, పట్టణ కేంద్రాలు, వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం అల్లోల ఇంటికి చేరుకున్న కార్యకర్తలు, ప్రజలు, కుటుంబ సభ్యులు, తన అనుచరగణంతో కలిసి తన ప్రచార వాహనంలో ఇంటి నుంచి బయల్దేరారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ప్రజలు, పార్టీ నాయకులు, అడుగడుగునా బ్రహ్మరథం పలికి ఘన స్వాగతం తెలిపారు.
దాదాపు 20 వేల మంది స్వచ్ఛందంగా తరలిరావడంతో నిర్మల్ పట్టణం గులాబీమయమైంది. జై తెలంగాణ.. జై ఇంద్రన్న అంటూ నినాదాలతో ర్యాలీ మార్మోగింది. కార్యకర్తలు డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు. నామినేషన్ అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు ఉన్నారు.