ఆదిలాబాద్, ఏప్రిల్ 30(ఆదిలాబాద్) : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఇటీవల ఆదిలాబాద్లో ప ర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ పరిధిలోని 2,111 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జో గు రామన్న, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఖానాపూర్, నిర్మల్, మథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు మే 13వ తేదీన జరుగనుండగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండుటెండలను లెక్క చేయకుండా గడప గడపకూ ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో వార్డు కమిటీలు, గ్రామాల్లో గ్రామ కమిటీలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రజల నుంచి స్పందన
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సం క్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర నెలలు గడిచినా అసెంబ్లీ ఎన్నికల్లో వారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడంతోపాటు రైతుబంధు, తాగు, సాగునీటి సమస్యలను ప్రజలకు తెలియ చేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఆ సభకు జనం తక్కువ సంఖ్య లో వచ్చారు. సీఎం మాట్లాడుతుండగానే వెనుదిరిగారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలిచినా కేంద్రం పెండింగ్లో ఉన్న ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కూడా జిల్లా సమస్యలపై మాట్లాడకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి గురి చేసింది. వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం, విమానాశ్రయం ఏర్పాటు, ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలేన్, నవోదయ స్కూల్ వంటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ అభ్యర్థికి కేంద్రం పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు, కాంగ్రెస్ అభ్యర్థికి ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మైనస్గా మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు పార్లమెంట్ పరిధిలోని నాయకులతో కలిసి పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ప్రచారం నిర్వహిస్తున్నారు.