బేల, మార్చి 31: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో బైరాందేవ్, మహాదేవ్ ఆలయ సమీపంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు కే ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను కూడా వివరించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడిని దోచుకుంటున్నదని మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాలు మన వద్ద అమలవుతున్నాయని గుర్తు చేశారు.
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి పేదలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకే ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బాసులని, పార్టీ జెండా పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. అనేక పథకాలతో ప్రజారంజక పాలనను బీఆర్ఎస్ అందిస్తున్నదని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, మస్కే తేజ్రావు, దేవన్న, రాందాస్, సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.