కుభీర్, మార్చి 31:భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యేలు, పార్టీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు జోగు రామన్న, విఠల్రెడ్డి అన్నారు. బేల, కుభీర్ మండలాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని, రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, వాటిని పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. పక్కనున్న మహారాష్ట్రలోనూ సీఎం కేసీఆర్కు ఆదరణ పెరిగిందని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం’నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, రాష్ట్రంతో పాటు దేశంలోనూ బీఆర్ఎస్కే భవిష్యత్ ఉందని చెప్పారు. పక్కనున్న మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్నారు. నాందేడ్, లోహాలో సీఎం కేసీఆర్ సభలు సక్సెస్ కావడంతో, అక్కడి ప్రభుత్వం రూ.6 వేల రైతుబంధు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన మేలేంటని ప్రశ్నించారు. ఎంపీగా సోయం బాపురావ్ తెచ్చిన నిధులు.. చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పాలని సవాల్ విసిరారు. ఆ పార్టీ నాయకులు గ్రామాల అభివృద్ధి పట్టకుండా కులం, మతం అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
పొరపాట్లు జరుగుతాయని, సరిదిద్దుకొని ముందుకెళ్లడమే పార్టీ ఏకైక లక్ష్యమన్నారు. సమన్వయంతో పనిచేసి మూడోసారి సీఎం కేసీఆర్ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముథోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. తండాలను పంచాయతీలుగా చేసి పాలనను గిరిజనులకు చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్ ప్రశ్నించారు. ఇక్కడి పథకాలనే కేంద్రం కాపీ కొడుతున్నదని పేర్కొన్నారు. ఇంటింటికీ పథకాలు చేరాయని, త్వరలో ప్రవేశపెట్టే గృహలక్ష్మి పథకం సంచలనం కాబోతున్నదని స్పష్టం చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని దేశంలోని ఎందరో సీఎంలు, మాజీ సీఎం లు ప్రశంసించారని గుర్తు చేశారు. మతం పేరిట, దేవుడి పేరిట రాజకీయాలు చేసే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో ఒక్క ఆలయమైనా కట్టించాయా అని ప్రశ్నించారు.
ఎవ్వరేం చెప్పినా మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆరేన ని స్పష్టం చేశారు. కాగా, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్పిన సమస్యలు, సూచనలను ఎమ్మెల్యే రాసుకున్నారు. ఇతర పార్టీల సర్పంచులు పనులు చేసేందుకు తీర్మానాలు ఇవ్వడం లేదని, దీంతో అభివృద్ధి నిలిచి పోతోందని సిర్పెల్లి(3) తండా అధ్యక్షుడు రాథోడ్ సుదాం చెప్పడంతో ప్రత్యామ్నాయంగా ప్రజలే తీర్మానం చేసుకోవాలని సూచించారు. కాగా, ఎమ్మెల్యే విఠల్రెడ్డికి పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి చౌక్లో ఘన స్వాగతం పలికారు. అక్కడే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభా ప్రాంగణం జై కేసీఆర్, జై విఠల్రెడ్డి నినాదాలతో హోరెత్తింది. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. మార్క్ఫెఢ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, పార్టీ మండలాధ్యక్షుడు అనిల్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఎన్.దత్తూగౌడ్, ఏఎంసీ చైర్మన్ సంతోష్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దొంతుల రాములు, రమేశ్, రాజేశ్, దిగంబర్ పటేల్, మహిపాల్రెడ్డి, ముజాహిద్ఖాన్, మాజీ సర్పంచ్ జీ.బాబు, గోనె కళ్యాణ్, సూది రాజన్న, బొప్ప నాగలింగం, నారడి మల్లేశ్, సోషల్ మీడియా మండల ప్రతినిధి గడ్డం సంజీవ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీలో భారీగా చేరికలు
మండలంలోని సిర్పెల్లి 3 తండా, హల్ద, హల్ద తండా, పల్సి తండా, రంగశివుని తండా, రంజని, వీరేగాంవ్, బెల్గాం తండా1, సేవాదాస్ నగర్లకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు రవిబాబా నాయక్, క్రాంతి చవాన్, గోవింద్, రాథోడ్ బాలాజీ, ఆడే పూల్ సింగ్, రాజేందర్, సాయినాథ్, వారి అనుచరులు సుమారు 500 మంది కార్యకర్తలు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. సేవాదాస్నగర్కు చెందిన జేడీ రామ్ బీజేపీ సీనియర్ మండల నాయకుడు. ఆయనతో పాటు వంద మంది పార్టీలో చేరారు. రాష్ట్రంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే వీరంతా పార్టీలో చేరారని ఎమ్మెల్యే విఠల్రెడ్డి తెలిపారు.