ఖానాపూర్, జూలై 12 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ శివారులో రెంకోనే వాగు వద్ద ఉన్న సైఫాన్ సమీపంలో కింద కాల్వ, పైన కాల్వ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వంతెన పిల్లర్లకు అనుకొని అత్యంత సమీపంలోనే భారీగా ఇసుకను తవ్వేస్తుండడంతో బ్రిడ్జి అడుగుభాగం కుంగిపోతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ వంతెన(బ్రిడ్జి) నిర్మాణాలు ప్రస్తుతం ప్రమాదం అంచున నిలిచాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగు అడుగుభాగంలో భారీ గుంతలు తవ్వడంతో పిల్లర్లకు సహజంగా లభించాల్సిన ఇసుక సపోర్టు(మద్దతు) పూర్తిగా తొలగిపోయింది.

ఫలితంగా పిల్లర్ల చుట్టూ నేల కోతకు గురవుతూ నిర్మాణం బలహీనపడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే వంతెన పిల్లర్లపై పగుళ్లు, సిమెంట్ ఊడిపోవడం వల్ల పిల్లర్లు కృంగిపోతున్నటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రానున్న వర్షాకాలంలో వరద ఉదృ్ధతి పెరిగితే పిల్లర్ల పునాదులు మరింత దెబ్బతిని వంతెనకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వాగులో జేసీబీలు ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకుండా ‘మాములు’గా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ట్రాక్టర్ల రాకపోకలతో వాగు పరిసర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా వ్యవసాయ భూములకు వెళ్లే దారులు కూడా గుంతలమయంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక తవ్వకాలతో వాగులో ఏర్పడిన లోతైన గుంతలతో పశువులు, రైతులు, ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు. అంతేకాకుండా, అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ట్రాక్టర్ల భారీ శబ్దం, నిరంతర రాకపోకల వల్ల వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు తమ సహజ ఆవాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేరొంటున్నారు.
పర్యావరణ సమతుల్యతకు కూడా ఈ అక్ర మ తవ్వకాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తిగా అరికట్టాలని, వంతెన నిర్మాణ భద్రతపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, వంతెన పునాదులను బలోపేతం చేసే అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.