బోథ్, ఆగస్టు 4 : బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది. 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెరిగింది. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రం బోథ్లో ఇది వరకు పది పడకల స్థాయి దవాఖాన మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 పడకల స్థాయికి పెంచింది. దవాఖానకు వచ్చే అవుట్, ఇన్పేషెంట్లు, చికిత్సలు, వైద్య సేవల తీరు, అవసరాలను గుర్తించి ప్రభుత్వం 100 పడకల స్థాయికి పెంచుతూ జీవో జారీ చేసింది. శిథిలావస్థకు చేరుకున్న భవన నిర్మాణ స్థానంలో కొత్త భవనం కోసం ఆరు నెలల క్రితం రూ.10.50 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. మళ్లీ వెనుకబడిన నియోజకవర్గ కేంద్రం, గిరిజన ప్రాంతం కావడంతో స్థాయిని పెంచుతూ కావాల్సిన ఇన్ఫాస్ట్రక్చర్ కోసం మరో రూ.17.50 కోట్లు మంజూరు చేసింది.
రెండు విడుతలుగా కలిపి మొత్తం రూ.25 కోట్లు కేటాయించింది. దవాఖాన స్థాయి పెరగడంతో నూతన భవనంతో పాటు మౌలిక వసతులు, పరికరాలు, వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆధునాతన ల్యాబ్ సౌకర్యం, వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆరుగురు వైద్యుల పోస్టులు మాత్రమే మంజూరు ఉండగా స్థాయి పెరుగుతుండడంతో 20 మంది వరకు వైద్యులు రానున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ పిడియాట్రిక్, గైనకాలజిస్టు వంటి ప్రత్యేక నిపుణుల పోస్టులు మంజూరు కానున్నాయి. గత ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం గురించి పెద్దగా పట్టించుకోక పోవడంతో బోథ్ దవాఖాన దశ మారలేకపోయింది. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుండడంతో బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది.
బోథ్ దవాఖాన వంద పడకల స్థాయికి పెంపుతో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. నూతన భవనంతో కావాల్సిన స్థలం సమకూరుతుంది. స్పెషలిస్టు డాక్టర్లు, ల్యాబోరేటరి, చికిత్సలు చేయడానికి అనువుగా మారుతుంది. సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. వంద పడకల స్థాయికి పెంచినందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు బోథ్ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
-డాక్టర్ ఆర్ రవీంద్రప్రసాద్, సూపరింటెండెంట్, బోథ్ సీహెచ్సీ