మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 11 : ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు తరలించే బియ్యంలో తరుగు వస్తుందనే డీలర్ల ఫిర్యాదు మేరకు మార్చి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పనులను జిల్లాలో మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రయత్నించగా సాంకేతిక కారణాల రీత్యా నిలిపివేశారు. మార్చి నెల నుంచి అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇది అమలులోకి వస్తే రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ కేంద్రాలలో జరిగే దోపిడికి అడ్డుకట్ట పడుతుందని డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ పాయింట్ వద్ద వేలిముద్ర వేస్తేనే…
ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ప్రతి నెలా డీలర్లు స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. తన దుకాణం పరిధిలోని కార్డుల ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 423 రేషన్ దుకాణాల వద్ద ఈ పాస్ విధానంతో కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతుంది. వచ్చే నెల నుంచి రేషన్ డీలర్లకు సైతం ఈ పాస్ అమలు చేయనుండడంతో ఎక్కడా కూడా తరుగుకు అవకాశం ఉండదని డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎల్ఎస్ పాయింట్లకు డీలర్లు వెళ్లాల్సిందే
వచ్చే నెల నుంచి డీలర్లు వారికి కేటాయించిన సమీప ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లి బయోమెట్రిక్ తంబ్ ఇవ్వాల్సిందే. అప్పుడే ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని తీసుకెళ్ల వచ్చు. ఈ నెల మొదట్లో బయోమెట్రిక్ ద్వారా మూడు రోజులు పంపించాం. పంపిణీకి ఆలస్యమవుతున్న దృష్ట్యా వచ్చే నెల నుంచి 100 శాతం బయోమెట్రిక్ ద్వారా రేషన్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి నెల కోటాకు సంబంధించి డీలరు స్వయంగా వచ్చి వేలిముద్ర వేసి తూకం చూసుకున్నాకే బియ్యం పంపిణీ చేస్తాం.
– ప్రేంకుమార్, సివిల్ సప్లయ్ డీఎం, మంచిర్యాల