ఆదిలాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. రేపు(బుధవారం) ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, మథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు భేటీకి తరలి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్, ఇతర సీనియర్ నాయకులు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విస్తృత స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్, ఖానాపూర్, కాగజ్నగర్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, మథోల్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది.
ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 4,65,476 ఓట్లు రాగా, బీజేపీకి 4,48,967, కాంగ్రెస్కు 2,52,281 ఓట్లు వచ్చాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్కు 16,509 ఓట్లు అధికంగా వచ్చాయి. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఉన్నారు. రేపు జరిగే సన్నాహక సమావేశం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపనుంది. సమావేశానికి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు. పార్టీ పెద్దల సూచనల మేరకు ఎంపీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని రామన్న పేర్కొన్నారు.