‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల్లో కెల్లా కండ్లు అత్యంత ప్రధానమైనవి. వీటిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఆదిలాబాద్ రిమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అధునాతన పరికరాలను సమకూర్చింది. జనరల్ వైద్యసేవలు మొదలుకొని రెటీనా చికిత్సలు అందిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి వైద్యసేవల కోసం రిమ్స్కు వస్తున్నారు. ప్రతినెలా 3 వేల మందికి కంటి చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 7 ( నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేదలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా కార్డియాలజీ, అం కాలజీ, న్యూరాలజీ సేవలను అందిస్తున్నది. వైద్య పరీక్షల్లో భాగంగా వివిధ రకాల యం త్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. రిమ్స్ లో మెరుగైన కంటి వైద్యం పేదలకు అందించడానికి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. కంటి సమస్యలతో బాధపడుతున్న గ్రామీణులతో పాటు షుగర్, బీపీ లాంటి ధీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కండ్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికీ రిమ్స్లో వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రిమ్స్కు వచ్చి వివిధ రకాల కంటి చికిత్సలు పొందుతున్నారు. రోజూ 100 మందికి పైగా కంటి సమస్యలతో వస్తుంటారని, వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్యం చేస్తామని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతినెలా 3,000 మందికి పైగా కంటి సమస్యలతో వస్తారని తెలిపారు.
రిమ్స్లో పేదలకు మెరుగైన నేత్రవైద్యం అందించడానికి ప్రభుత్వం రూ.కోటితో అధునాతన యంత్రాలను సమకూర్చింది. ఆప్తాల్మజీ విభాగం వైద్యులు ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. జనరల్ ఆప్తాల్మజీ, కళ్లద్దాలు, శుక్లాలు, గ్లకోమా, కార్నియా, లీడ్ ట్రామా, రెటీనా లాంటి వైద్యసేవలు ఉచితంగా అందుతున్నాయి. ప్రమాదాల్లో కంటి దెబ్బలు తగిలిన వారికి సైతం వైద్యులు సత్వర చికిత్సలు చేస్తున్నారు. నేత్ర పరీక్షల కోసం స్లిట్ ల్యాంప్ మిషన్ విత్ ఇమేజింగ్ సిస్టం, ఫండస్ కెమెరా, లేజర్ ఫొటో కోయాగులేషన్ మిషన్, డైక్రో సిస్సైటస్ లాంటి అధునాతన యంత్రాలున్నాయి. రెటీనా లాంటి కంటి వ్యాధులకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం రిమ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాలతో పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్యసేవలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
నా పేరు బండారి లింగన్న. మాది మంచిర్యాల జిల్లా జన్నారం. నాకు సానా కాలంగా కండ్లు మసకగా కనిపిస్తన్నయ్. దగ్గరి సూపు సరిగ్గా లేదు. మా జిల్లాలో సూపిచ్చినా లాభం లేదు. ఆదిలాబాద్ లోని రిమ్స్లో మంచిగ సూత్తరని గిక్కడికచ్చిన. మా ఇంటి పక్కొళ్లు గూడా సూపిచ్చుకుంటే మంచిగైనయ్. నాకు గూడా మంచిగైతాయను కుంటున్న. డాక్టర్లు పరీచ్చలు గూడా చేసిండ్రు. ఇంకా పరీచ్చలు జేయాలని జెప్పిండ్రు. మళ్లీ రమ్మన్నరు. మళ్లస్త. మంచిగ జేపిచ్చుకొని పోత.
ఆదిలాబాద్ రిమ్స్లో ఆప్తాల్మజీ విభాగం ఆధ్వర్యంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతూ రిమ్స్కు వస్తుంటారు. రోజూ 100 వరకు ఓపీ ఉంటుంది. ప్రభుత్వం సమకూర్చిన వైద్య పరికరాలతో అవసరమైన పరీక్షలు చేస్తాం. పలు రకాల ఆపరేషన్లు సైతం జరుగుతున్నాయి. రెటీనా లాంటి వ్యాధులకు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. షుగర్, బీపీ లాంటి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు క్రమంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. దీంతో ప్రాథమిక దశలోనే వైద్యం అందించే అవకాశాలున్నాయి. కంటి వెలుగు పథకంలో భాగంగా అవసరమైన వారికి రిమ్స్లో వైద్య సేవలు అందిస్తాం.
– ఇంద్రీస్ అక్బానీ, నేత్ర వైద్య నిపుణుడు, రిమ్స్, ఆదిలాబాద్ ( 2 ఏడీబీ 07 డీ)
నా కుడి కన్ను సూపెట్టుకుందామని ఇక్కడికి వచ్చిన. ఆదిలాబాద్ రిమ్స్లో మంచిగా కంటి వైద్యం అందుతుందని తెలుసుకొని అక్కడికి వచ్చిన. డాక్టర్లు చూసి పరీక్షలు చేసిండ్రు. ఇంకా పరీక్షలు చేస్తామని చెప్పిండ్రు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు మా ఊరి నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. డాక్టర్లు, సిబ్బంది మంచిగా చూస్తున్నారు.
– బండారి లింగన్న, జన్నారం, మంచిర్యాల జిల్లా ( 2 ఏడీబీ 07 ఈ)