ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్డు సౌకర్యాలు లేక పల్లె ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. వానకాలం వచ్చిందంటే మట్టిరోడ్లు బురదమయంగా మారి.. వాగులు ఉప్పొంగి అనేక గ్రామాలకు రవాణా స్తంభించేది. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అరిగోస పడాల్సి వచ్చేది. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందక ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనలున్నాయి. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దాల ‘దారి’ద్య్రం పోయింది. బీఆర్ఎస్ సర్కారు గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించింది. జిల్లాలో గత రెండేళ్లలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 230.03 కిలోమీటర్ల రహదారితో పాటు అవసరమైన చోట వంతెనలు నిర్మించింది. మొత్తంగా 103 పనులకు గానూ రూ.132.61 కోట్లు ఖర్చు చేసింది.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడాలు ఎక్కువ గా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేం ద్రాలకు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వానకాలంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. లో లెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహించేది. గర్భిణులు ప్రస వం సమయంలో, వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం, ప్రజలు తమ అవసరాల కోసం మండలం కేంద్రాలకు రావాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారుల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం కల్పించింది. వీటితో పాటు గ్రా మాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు నిర్మించింది.
రెండేళ్లలో రూ.132.61 కోట్లు మంజూరు
జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగు పర్చడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం 103 పనులకు రూ. 132.61 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా జిల్లాలో 230.03 కిలోమీటర్ల బీటీ రహదారుల నిర్మిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 41 పనులకు రూ. 18.55 కోట్లను మంజూరు చేయగా 63.8 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13 పనులకు గానూ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 5.42కోట్లు, బోథ్ నియోజకవర్గంలో12 పనులకు గానూ 23.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 6.23 కోట్లు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడు పనులకు గానూ 3 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ. 1.20 కోట్ల మంజూరు చేశారు. వీటిలో అన్ని రహదారుల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 62 పనులకు గానూ రూ. 114.06 కోట్లను మంజూరు చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 18 పనులకు గానూ 21.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 17.83 కోట్లు, బోథ్ నియోజకవర్గంలో 29 పనులకు గానూ 128.80 కిలోమీటర్ల రహదారి కోసం రూ. 75.18 కోట్లు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 6 పనులకు గానూ 5.86 కిలోమీటర్ల రహదారి కోసం రూ. 11.40 కోట్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 9 పనులకు గానూ 10.37 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ. 9.65 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో ఈ నిధులతో 166.23 కిలోమీటర్ల రహదారులు, వంతెనలు నిర్మిస్తున్నారు. కొన్ని పనులు ఇప్పటికే పూర్తికాగా, మిగతా చోట్ల కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడింది. వానకాలంలో భారీ వర్షాలు పడినా ఇబ్బందులు కలుగడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు తమకు అవసరమైన పనుల కోసం 24 గంటల పాటు రాత్రింబవళ్లు ప్రయాణం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వల్లే తమకు రహదారి కష్టాలు తీరాయని చెబుతున్నారు.
పల్లెలకు మెరుగైన రవాణా సౌకర్యం
ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లలో ప్రజలకు రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలతో పాటు, మారుమూల గ్రామాల ప్రజలు వానకాలంలో రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడేవారు. వివిధ గ్రాంట్ల కింద జిల్లాలో అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడానికి పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి రహదారులు, వంతెలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తాం. -మహవీర్, ఈఈ, పంచాయతీరాజ్ శాఖ, ఆదిలాబాద్