ఆదిలాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వానకాలంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే నరకయాతన అనుభవించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలకు ప్రయాణం ప్రాణ సంకటంగా మారేది. తమ గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కరుణించని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారుల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపట్టింది.
రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు మొదలుకుని జిల్లా కేంద్రం వరకు రహదారులు నిర్మించారు. పదేళ్లలో జిల్లాలోని మూడు శాఖల ఆధ్వర్యంలో రూ. 743 కోట్లతో 478 పనులు చేపట్టారు. వివిధ గ్రామాలకు పోయే రోడ్లకు అడ్డంగా ఉన్న వాగులపై 20 వంతెనలు నిర్మించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగింది. ఇటీవల ఇంద్రవెల్లి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి రోడ్లు నిర్మించలేదని వ్యాఖ్యనించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడాలు, గిరిజన తండాల రవాణా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని మట్టి రోడ్లు ఉన్న గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లను నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 233.18 కోట్లతో 278 రోడ్ల పనులను గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. గిరిజన గ్రామాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బీటీ రోడ్లు, నిధులు మంజూరు చేయడంతో ప్రజలు ఏడాది పొడవునా సాఫీగా రాకపోకలు సాగించనున్నారు.
చిత్రంలో కనిపిస్తున్నది ఆదిలాబాద్ నుంచి బేలకు పోయే రహదారి. కాంగ్రెస్ పాలనలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వచ్చేది. రోడ్డు సరిగా లేకపోవడంతో బస్సు కూడా వచ్చేది కాదు. ప్రజలు జీపుల్లో టాప్పైన కూర్చొని ప్రయాణం చేసేవారు. వానకాలంలో రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు సాగేవి కావు. గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం బేల నుంచి ఆదిలాబాద్కు రావాలంటే 2 గంటల సమయం పట్టేది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 55 కోట్లతో 32 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రోడ్డు మధ్యలో నాలుగు వంతెనలు సైతం నిర్మించారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. 45 నిమిషాల్లో బేల నుంచి ఆదిలాబాద్కు చేరుకుంటున్నారు.