హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తేతెలంగాణ): సమాజాన్ని నిత్యం చైతన్యం చేయ డం ద్వారా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ యువతకు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సార్ అస్తిత్వ ఆలోచనా విధానం తెలంగాణకు ఎల్లకాలం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన సిద్ధాంతకర్త, స్వయంపాలన స్వాప్నికుడు ‘సర్’ జయంతిని పురస్కరించుకొని ‘ప్రత్యేక పోరు’లో ఆయనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతకర్త చేసిన కృషిని ప్రస్తావిస్తూ ఆయనకు ఘనం గా నివాళులర్పించారు. తెలంగాణ సాధన, నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఒంటరిగా బయల్దేరిన సమయంలో జయశంకర్ సార్ సూచనలు, సలహాలిస్తూ అడుగడుగునా అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ఘ నుడని కీర్తించారు. సైద్ధాంతిక నిబద్ధతతో ‘ప్రత్యేక’ భావజాల వ్యాప్తి చేశారని శ్లాఘించారు.
ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం
పదేండ్ల స్వయంపాలన తర్వాత ప్రస్తు తం తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ప డిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు స్వీయ మానసిక సంఘర్షణకు గురికాకుండా సామాజిక, సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణకు గస్తీ కాసే సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. స్వరాష్ట్రం కోసం జీవితాన్ని ధారబోసిన జయశంకర్ సార్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సముచితంగా గౌరవించినట్టు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి చిరస్థాయిగా నిలిపామని తెలిపారు. ఆయన మార్గదర్శనంలో అనేక నిర్ణయాలు తీసుకొని అమలు చేశామని తెలిపారు.