‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీయే తెలంగాణవాసులకు శ్రీరామరక్ష. 60 లక్షల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ మనది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ సునాయసంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది..’ అని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి లక్ష్మణ్రావు ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 14, 15, 16, 17, 18, 28, 29, 30 వార్డుల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం శనివారం అగర్వాల్ భవన్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కమలం పార్టీ అతి ప్రమాదకరమైనదన్నారు. మోదీ, అమిత్షాలు దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత 12 రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాగే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాపీ అండ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరగ్గా.. ఎమ్మెల్యే కోనప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
– బెల్లంపల్లి/కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 1
బెల్లంపల్లి, ఏప్రిల్ 1 : బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 14, 15, 16, 17, 18, 28, 29, 30 వార్డుల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం శనివారం అగర్వాల్ భవన్లో నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్రావు హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుకున్న లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారన్నారు. 60 లక్షల వరకు పార్టీ సభ్యత్వం కలిగిన బలగంతో వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైటీకరణ చేయాలని చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని.. మోదీ, అమిత్షాలు దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత 12 రాష్ర్టాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏ పార్టీ మనకు అండగా ఉంటుందో అదే పార్టీని ఆదరించాలని సూచించారు.
మూడోసారి గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడోసారి గెలిపించుకొని, సంక్షేమ పథకాల ఫలాలను రెట్టింపు చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పింఛన్ రూ.75, రూ.200 ఉండగా.. సీఎం కేసీఆర్ ఏకంగా రూ.2,016 చేశారని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ను పెంచుకుందామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఖాళీ స్థలాలు ఉన్న వారికి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు కేసీఆర్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో 6,485 పింఛన్లు, 1200 మందికి కల్యాణలక్ష్మి, 482 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు. వడ్డీలేని రుణాలను సర్కారు మంజూరు చేయగా.. బెల్లంపల్లి మున్సిపాలిటీకి రూ.62.13 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల హామీలైన ఇళ్ల పట్టాలను ఇచ్చుకుంటున్నామన్నారు. మంచినీటి సమస్య తీర్చి ఇంటి ముంగిట్లోకి నీటిని తీసుకొచ్చామని పేర్కొన్నారు. జీవో నంబర్ 58, 59, 76ల ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కొంత సమయం ఇచ్చిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పార్టీని వీడితే గులాములుగా బతకాల్సిందే : కరీంనగర్ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు షుక్రుద్దీన్..
గులాబీ పార్టీని విడితే గులాములుగా బతకాల్సి వస్తుందని కరీంనగర్ జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు షుక్రుద్ధీన్ అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హయాంలో బెల్లంపల్లి పట్టణ రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. గత ఎమ్మెల్యేలు పట్టించుకోని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసెంబ్లీలో కొట్లాడి మరీ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. చిన్నయ్యను మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పట్టాల ఘనత ఎమ్మెల్యే చిన్నయ్యదే : బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత.
బెల్లంపల్లి పట్టణంలో చరిత్రను తిరగరాసి పట్టాల పంపిణీ ప్రక్రియను కొలిక్కి తీసుకొచ్చిన ఘనత కేవలం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకే దక్కుతుందని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు ఉన్నత పదవులు వస్తాయని, అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. సమయాన్ని బట్టి ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందని, సహనాన్ని కోల్పోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్నయ్య విజయం ఖాయం కావడంతో.. ప్రతిపక్షాలు రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా ద్వారా బురదజల్లాలని చూస్తున్నాయని విమర్శించారు.
బెల్లంపల్లిలో వాట్సాప్ రాజకీయాలు : బత్తుల సుదర్శన్, మున్సిపల్ వైస్ చైర్మన్.
బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు వాట్సాప్ వేదికగా రాజకీయాలు చేయడం సిగ్గు చేటని మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ విమర్శించారు. రాష్ట్రంలో ఈడీ, సీబీఐలను రంగంలోనికి దింపుతున్న బీజేపీ బెల్లంపల్లిలో వాట్సాప్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను తిప్పికొడుతూనే.. మరోవైపు చిన్నయ్యను గెలిపించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రవణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, సీనియర్ కౌన్సిలర్ గెల్లి రాజలింగు, కౌన్సిలర్ దామెర శ్రీనివాస్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడగా.. కౌన్సిలర్లు, బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.