బెల్లంపల్లి, ఏప్రిల్ 27 : సమైక్యపాలనలో ఆదరణకు నోచుకోని గ్రంథాలయాలకు.. స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. నాడు అద్దెభవనాల్లో అరకొర వసతులతో సాగగా, నేడు బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధతో అత్యాధునిక భవనాల్లో కొనసాగుతున్నాయి. దినపత్రికలకు మాత్రమే పరిమితం కాకుండా పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అనేక రకాల పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతున్నది. ఇక మరోవైపు గ్రం థాలయాల్లో నిరుద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా గ్రంథాలయాల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రంథాలయాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. బెల్లంపల్లి (మంచిర్యాల), మహబూబాబాద్, బడాన్పేట్ (సిద్ధిపేట్), దేవరకొండ (నల్గొండ) గ్రంథాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
రెండు గదుల్లో శిక్షణ..
రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 లక్షలు వెచ్చించి బెల్లంపల్లి గ్రంథాలయాన్ని సకల హంగులతో నిర్మించింది. గతేడాది మే 2న ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ దీనిని ప్రారంభించారు. ఇందులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములు ఏర్పాటు చేశారు. దినపత్రికలు చదివే వారి కోసం మరో హాల్ను ఏర్పాటు చేశారు. పాఠకులకు సౌకర్యంగా ఉండేలా కుర్చీలు అమర్చారు. డీఈఎఫ్ రీజినల్ మేనేజర్ జీ.మణికంఠ గతవారం గ్రంథాలయాన్ని సందర్శించి శిక్షణకు సరిపడా గదులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని ఆరా తీశారు. రెండు గదుల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయవచ్చని భావించి నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించారు. రెండు నెలల్లోగా శిక్షణ కేంద్రం ప్రారంభించే అవకాశముండగా, బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు 15 జిల్లాల నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనున్నది.
వివిధ అంశాల్లో శిక్షణ
ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు గ్రంథాలయంలో వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ తదితర శిక్షణ కార్యక్రమాలను నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా నిర్వహించనున్నారు. యువకులు రిజిష్టర్లో పేరు, ఆధార్కార్డు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, అడ్రస్, కోర్సు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం మూడేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగనున్నది. 45 రోజుల కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ సర్టిఫికెట్ అందించనున్నారు. ఈ సర్టిఫికెట్తో వివిధ కంపెనీల్లో సులువుగా ఉద్యోగం పొందవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ (టాస్క్) సంయుక్తంగా బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఈ శిక్షణపై విధి విధానాలు, కార్యాచరణను అభ్యర్థులకు వివరిస్తాం. విస్తృతంగా ప్రచారం చేస్తాం.
-రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్