మంత్రి కేటీఆర్ కృషితోనే బెల్లంపల్లిలో ఏర్పాటు
విద్య, వైద్యం, సాగు నీటి రంగానికి పెద్దపీట
జోడెడ్లలా సంక్షేమం, అభివృద్ధి ముందుకు..
కొలువుల జాతర కొనసాగుతుంది
ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ.. నాణ్యమైన భోజనం
త్వరలో సింగరేణి స్థలాల నివాసులకు ఇండ్ల పట్టాలు
‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను మంత్రి కేటీఆర్ సహకారంతో బెల్లంపల్లికి తీసుకొచ్చామని, దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా ముందుకు సాగుతుందని, విద్య, వైద్యం, సాగు నీటి రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని, ఉద్యోగార్థుల కోసం బెల్లంపల్లిలో ఉచితంగా కోచింగ్, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వివరించారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్నవారికి త్వరలో పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మంచిర్యాల, జూన్ 7, నమస్తే తెలంగాణ/ బెల్లంపల్లి టౌన్ : ఫుడ్ ప్రాసెసింగ్ జోన్తో బెల్లంపల్లిలో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : బెల్లంపల్లిలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు.?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బెల్లంపల్లి అంటే ముఖ్యంగా సింగరేణి ప్రాంతం. ఇక్కడ కార్మిక కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ఇక్కడి సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో నిరుద్యోగ సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను మంత్రి కేటీఆర్ సహకారంతో బెల్లంపల్లికి తీసుకొచ్చాను. బెల్లంపల్లిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న పాలిటెక్నిక్ కళాశాల వెనుక గల ప్రాంతంలో 350 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు అందించాం. నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న విలువైన భూమిని ఇందుకోసం ఇచ్చాం. అందులో వారు 27 కంపెనీలకు మంజూరు చేశారు. త్వరలో సదరు కంపెనీలకు సర్టిఫికెట్లు అందించి మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. రోడ్లు పూర్తి కావస్తున్నాయి. కంపెనీ పెట్టే వారికి ట్రాన్స్ఫార్మర్, డ్రైనేజీ, నీరు, విద్యుత్తో పాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం. హైదరాబాద్ వంటి నగరాల్లో మాదిరిగా ఇక్కడ కూడా వివిధ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్తో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య తీరనుంది.
నమస్తే తెలంగాణ : విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి ఏమిటి ?
ఎమ్మెల్యే : విద్యాభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలో మొదట కళాశాలలకు భవనాలు మంజూరు చేయించాం. కాసిపేట జూనియర్ కాలేజీ బిల్డింగ్, బెల్లంపల్లి బాలురు, బాలికల కళాశాల భవనాల మంజూరుకు కృషి చేశాను. డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూపు లేకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గినట్లు దృష్టికి వచ్చింది. తీవ్రంగా కృషి చేసి విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 600 మంది వరకు తీసుకెళ్లాం. సైన్స్ గ్రూపులు, కంప్యూటర్ కోర్సులు, డిజిటలైజేషన్ క్లాసులతో ప్రస్తుతం డిగ్రీ కాలేజీ 600 మంది విద్యార్థులతో అద్భుతంగా నడుస్తున్నది. ముఖ్యంగా ఏడు రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేయించుకోగలిగాం. ఎస్సీ సోషల్ వెల్ఫేర్ నుంచి మూడు, బీసీ సాంఘిక సంక్షేమ బాలురు, బాలికలకు రెండు స్కూళ్లు, మైనార్టీ గర్ల్స్ తీసుకొచ్చాం. కస్తూర్బా హాస్టళ్లు పదో తరగత వరకు ఉండేవి. వాటిని తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ వరకు పెంచుకోగలిగాం. ప్రస్తుతం మండలానికో కస్తూర్బా హాస్టల్ ఉంది. అందులో జూనియర్ తరగతులు నడుస్తున్నాయి. బెల్లంపల్లికి పీజీ, ఇంజినీరింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
నమస్తే : మెరుగైన వైద్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఎమ్మెల్యే : గతంలో బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్లో 30 పడకల దవాఖాన ఉండేది. అర్బన్లో ఒక హాస్పిటల్ ఉండేది. అవి అంతంతమాత్రంగానే నడిచేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు వేతనాలు పెంచడం, వైద్యుల ఉద్యోగాలను భర్తీ చేయడంతో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. అర్బన్ హాస్పిటల్లో సేవలు మెరుగుపడ్డాయి. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్లోని దవాఖానను 30 నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేశాం. ప్రైవేట్కు దీటుగా దవాఖాన భవనాన్ని అందంగా తీర్చిదిద్దాం. అద్భుతమైన సేవలందిస్తున్నాం. కేసీఆర్ కిట్లు, వైద్య సిబ్బంది కృషి, మెరుగైన సౌకర్యాల కల్పనతో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అధికంగా డయాలసిస్ బాధితులు ఉన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో డయాలసిస్ సెంటర్ మంజూరు చేయించుకున్నాం. క్రిటికల్ కేర్ అయితే తప్ప వైద్యం కోసం రోగులను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నాం.
నమస్తే : ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్ అందిస్తున్నారా? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
ఎమ్మెల్యే : స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కొలువుల మేళా నిర్వహిస్తున్నది. పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యోగార్థులకు ఉచితంగా మెరుగైన కోచింగ్, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. హైదరాబాద్, వరంగల్వంటి నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని వారికి బెల్లంపల్లిలోనే ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం. విద్యావంతులు, మేధావులు, గ్రూప్ 1, 2 ఉద్యోగస్తులు, తదితర ఉత్తమమైన అధ్యాపకులను తీసుకొచ్చి ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిపుణులైన ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తున్నది. భీమిని, కన్నెపల్లి, కాసిపేట, వేమనపల్లితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పొరుగున ఉన్న రెబ్బెన, తదితర ప్రాంతాల నుంచి కూడా యువకులు కోచింగ్కు వస్తున్నారు. సుమారు 350 మంది వివిధ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వసతులు, శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా గ్రంథాలయంలోనూ ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నాం.
నమస్తే : సింగరేణి ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తున్నారు కదా?
ఎమ్మెల్యే : సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇవ్వాలని నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2014 అసెంబ్లీలోనే ప్రస్తావించాను. దీనికి సమాధానంగా, బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు గల సింగరేణి ప్రాంతంలో ఏండ్లుగా ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలివ్వాలని ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ల నుంచి ఇల్లందు వరకు చాలా మందికి ఇండ్ల పట్టాలు అందించారు. పలు కారణాలతో ఇక్కడ ఆలస్యమైంది. బెల్లంపల్లిలోనూ ఎస్ఆర్టీ క్వార్టర్స్ లను వివిధ విభాగాలతో జాయింట్గా రీ సర్వే చేయించి నివేదికలు పంపించాం. త్వరలో పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలోని వారి ఏండ్ల పట్టాల కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.
నమస్తే : గతంతో పోలిస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది?
ఎమ్మెల్యే : బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని వామపక్షాలు పరిపాలించాయి. గ్రామాలకు, పట్టణాలకు సరైన రోడ్లు లేకుండె. మొదట గ్రామాల్లో రోడ్లను పూర్తి చేశాం. ప్రతి మండలకేంద్రానికీ రోడ్డు సౌకర్యం కల్పించాం. రవాణా సౌకర్యం మెరుగుపడింది. జిల్లాకేంద్రానికి రాకపోకలు పెరిగాయి. రోడ్లన్నిటికీ నిధులు మంజూరయ్యాయి. కాగా, ఫారెస్టు డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు లేక కొన్ని, ఫైనాన్స్ క్లియరెన్స్ లేక మరికొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. మిగితా చోట్ల రోడ్లన్నీ దాదాపు పూర్తి చేశాం. గ్రామాల్లో నీటి పారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చాం. చెరువులను మరమ్మతు చేశాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తున్నాం.