నిర్మల్ జిల్లాలో సకల వసతులతో బస్తీ దవాఖాన
ఈనెల 17న అందుబాటులోకి రానున్న వైద్యసేవలు
మంత్రి అల్లోల చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
నిర్మల్ పట్టణవాసులకు అందుబాటులోకి రానున్న వైద్యం
పల్లె, బస్తీ దవాఖానలతో జిల్లా ఆస్పత్రిపై తగ్గనున్న భారం
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానను ఏర్పాటు చేసింది. సకల వసతులతో ముస్తాబైన బస్తీ దవాఖానను ఈనెల 17న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణవాసులకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానుండగా.. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానపై భారం తగ్గనుంది.
నిర్మల్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న బస్తీ దవాఖానలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయించింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. తొలుత నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం ఈనెల 17న అందుబాటులోకి తీసుకొస్తున్నది. జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలు ఉండగా.. 15వేల నుంచి 20వేల లోపు ఉన్న జనాభాకు ఒక్క బస్తీ దవాఖానను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే మరిన్ని బస్తీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయి.
పల్లె ముంగిట వైద్య సేవలు..
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. నిర్మల్ జిల్లాలో 16 పీహెచ్సీలు, ముథోల్, ఖానాపూర్లలో రెండు సీహెచ్సీలు ఉన్నాయి. ఇటీవలనే నర్సాపూర్ పీహెచ్సీ సైతం సీహెచ్సీకి అప్గ్రేడ్ అయ్యింది. మరో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు పల్లె ప్రజానీకానికి సేవలు అందిస్తున్నాయి. అలాగే జిల్లాకు 18 వెల్నెస్ సెంటర్లు, 32 పల్లె దవాఖానలు మంజూరు కాగా.. వీటిలో 17 దవాఖానలను అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక వైద్యానికే పరిమితమైన పీహెచ్సీ హోదాను పెంచి పల్లె దవాఖానలుగా మార్చడంతోపాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారిని వైద్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ కేంద్రాల పరిధిలో గతంలోనే ఇద్దరు ఏఎన్ఎంలు, జనాభానకు అనుగుణంగా ఆశ కార్యకర్తలు ఉండడంతో వారి ద్వారా సేవలు కొనసాగుతున్నాయి. గర్భిణులకు సేవలు, వివిధ వయసులవారీకి టీకాల పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, విపత్కర పరిస్థితుల్లో, సీజనల్ వ్యాధు లు ప్రబలే క్రమంలో ప్రథమ చికిత్స, కుటుంబ నియంత్రణ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్యసేవల కోసం దగ్గరలోని పీహెచ్సీలు, జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్తున్నారు.
పట్టణవాసులకు చేరువలో..
పల్లె దవాఖానల మాదిరిగానే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడంతో పట్టణవాసుల ముంగిటకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఓపీ సేవలతోపాటు ఉచితంగా మందులు పొందవచ్చు. రక్త, మూత్ర పరీక్షలు కూడా ఇక్కడే చేసుకోవచ్చు. సంబంధిత శాంపిల్స్ను నిర్దారణ కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని డయాగ్నొస్టిక్ సెంటర్కు పంపిస్తారు. రోజు జిల్లా కేంద్ర దవాఖానతోపాటు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 200 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతుంటుంది. సాధారణ జ్వరాలతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికే వస్తుంటారు. రోగుల తాకిడితో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బస్తీ దవాఖానల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గనుంది.
పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు..
పట్టణాల్లో నివసించే వారికి ఓపీ సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి డాక్టర్తోపాటు సిబ్బంది నియామకాన్ని చేపట్టాం. బస్తీ దవాఖానతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఇక్కడకు వచ్చి ఉచితంగా మందులను పొందడంతోపాటు పలు రకాల పరీక్షలు చేసుకోవచ్చు. ఈనెల 17న మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ ధన్రాజ్, డీఎంహెచ్వో, నిర్మల్