బాసర, మార్చి 18 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం రాత్రి నుంచి దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు అడ్మినిష్ర్టేషన్ భవనం, వీసీ గెస్ట్హౌస్ ఎదుట ఆందోళన చేసి రాత్రి అక్కడే బస చేశారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న మెదక్ జిల్లా రాంచంద్రాపూర్కు చెందిన తేజస్విని కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాసర ట్రిపుల్ ఐటీలో చికిత్స పొందుతూ తల్లిదండ్రుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా ఈ నెల 16వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లుకేమియా వ్యాధితో మృతి చెందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
టీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ట్రిపుల్ ఐటీలోని ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవని, దీని వల్లనే సదరు తేజస్విని వైద్యం అందక మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి మృతికి వారికి తల్లిండ్రులకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని టీఎస్ఏఎస్ విభాగంతోపాటు దాదాపు 500 మంది విద్యార్థులు అడ్మినిష్ర్టేషన్ భవనాన్ని ముట్టడించారు.
మంగళవారం రాత్రి మొత్తం వీసీ రావాలి, న్యాయం చేయాలని ఆందోళన చేశారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఎన్నిసార్లు విన్నవించిన విద్యార్థులు వినకపోగా వీసీ గెస్ట్హౌస్ ఎదుట రాత్రంతా రోడ్డుపైనే నిద్రించారు. ఉదయం వేకువ జామున ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులకు సమస్యలు తెలుసుకొన్నారు.
వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్తో సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ల గురించి తెలియజేశారు. దీంతో విద్యార్థులు తమకు ప్రధాన సమస్య ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, వీసీ రాజీనామాను తాము కోరలేదని, వీసీ ఇక్కడే ఉంటూ తమకు ఆసుపత్రిలో అన్ని సదుపాయాలతోపాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని డిమాండ్లను నెరవేర్చాలని, అలాగే కొన్ని సమస్యలు ఇది వరకే తెలియజేశామని, అందులో భాగంగా గతంలో జరిగిన మెస్ కాంట్రాక్టు విషయంతోపాటు ఫైనాన్స్ విషయంలో థర్డ్పార్టీ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్పీ సూచనల మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.
యూనివర్సిటీ అడ్మినిష్ర్టేషన్ తమ సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంలో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సహకరించడంతో టీఎఏఎస్ విద్యార్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్పీ విద్యార్థులను దూషించినట్లు సోషల్ మీడియాలో తాము ఎలాంటి వీడియోలను ప్రచారం చేయాలని ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
బాసర, మార్చి 18 : బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాలు చోటు చేసుకున్న క్రమంలో డీఎస్పీ రాజేశ్వర్ను డీజీపీ ఆదేశాల మేరకు నాగర్కర్నూల్కు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఈ బదిలీపై పలు ప్రశ్నలు దారితీస్తున్నాయి. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనాన్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.