ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు మంచిర్యాల కేంద్రంగా నిషేధిత క్యాట్ ఫిష్తో పాటు పాంగాసియస్ చేపలు పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందారం, దొనబండ వద్ద 50 ఎకరాలు లీజుకు తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కాసులకోసం కక్కుర్తి పడి దాణాకు బదులు చౌకగా దొరికే కుళ్లిన కోళ్ల వ్యర్థాలను మీనాలకు వెదజల్లడమేగాక, ఆ కలుషిత నీటిని స్థానికంగా ఉండే చెరువు, గోదావరిలోకి వదులుతున్నారు, ఇక్కడ పెరిగిన ఈ విషపూరితమైన ఫిష్లను తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల్లోని మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండగా, వాటిని తింటే రోగాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మంచిర్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వంద గ్రాముల మటన్లో 15 గ్రాముల కొవ్వు, 26 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.. వంద గ్రాముల చికెన్లో 13 గ్రాముల కొవ్వు, 25 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వంద గ్రాముల చేపలో 1.18 మిల్లీగ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. అందుకే మాంసం ప్రియులు.. ముఖ్యంగా కూర్చొని పని చేసే వారు నెలలో ఒకసారి చికెన్ లేదా మటన్ తింటూ, మిగిలిన సమయాల్లో చేపలను ఆహారంగా తీసుకుంటే మంచిదని న్యూట్రీషియన్ల సలహా.. చేపలు తరచూ తింటే కేన్సర్, గుండె జ బ్బులు దరిచేరవు. కానీ మంచిర్యాల జిల్లాలో రెం డు ప్రదేశాల్లో ప్రైవేటు వ్యక్తులు 50 ఎకరాల్లో పెం చుతున్న చేపలు తిన్నారా.. ఇక అంతే సంగతు లు. ఆరోగ్యం బాగుపడడం మాట పక్కన పెడితే ఆ చేపలు తింటే లేని రోగాలను కొని తెచ్చుకున్న ట్లే.. ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ చే పలకు దాణాకు బదులు.. కోళ్ల వ్యర్థాలనే ఆహారంగా వేస్తారు. చికెన్ సెంటర్లలో మాంసం విక్రయించగా మిగిలిన పేగులు, తోళ్లు, మెడ భాగా లు, కాళ్లు, ఈకలు వీటన్నింటినీ తెచ్చి.. దాణాలో కలిపి చెరువుల్లో వెదజల్లుతున్నారు. ఇలా చేస్తే ఏడాదిలో పెరగాల్సిన చేపలు ఆరు నెలల్లోనే చేతికి వస్తాయి. తద్వారా ఒక్క ఏడాదిలో రెండుసార్లు చేపలు తీయొచ్చు. ఆదాయం డబుల్ అవ్వడమేగాకుండా.. దాణా ఖర్చు సగానికిపైగా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తులు కొన్నేళ్లుగా మంచిర్యాలలో చేస్తున్న ఈ దందాపై “నమస్తే తెలంగాణ” ప్రత్యేక కథనం.
కోళ్ల వ్యర్థాలు తినే చేపలు యమ డేంజర్..
సాధారణంగా కోళ్ల వ్యర్థాలు తినే చేపలు క్యాట్ఫిష్, పాంగాసియస్ మాత్రమే. ఇందులో క్యాట్ఫిష్పై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. ప్రాణాంతకమైన ఈ చేపలు మన దగ్గర పెంచొద్దు. కానీ మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ వ్యక్తి చేపల చెరువులో రెండేళ్ల క్రితమే క్యాట్ఫిష్ను గుర్తించారు. పెంపకం దారులపై చర్యలు తీసుకొని, మళ్లీ ఇలాంటివి చేయొద్దని సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇం దారం, కాచనపల్లి, భీమారం, పోలంపల్లి, దొనబండ గ్రామాల రైతుల నుంచి భూములు లీజుకు తీసుకొని ఈ దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. అధికారుల హెచ్చరికలతో ఇందులో చాలా మంది తీరు మార్చుకున్నారు. కొందరు లీజు వదిలేసుకొని వెళ్లిపోయారు. కానీ ఇందారంలో గోదావరి ఒడ్డున ఉన్న 40 ఎకరాలు, హజీపూర్ మండలం దొనబండ గ్రామంలోని 10 ఎకరాల్లో ఇప్పటికీ నలుగురు ఆంధ్రకు చెందిన వ్యక్తులు చికెన్ వ్యర్థాలతోనే చేపలు పెంచుతున్నారు. చెరువుల్లో ఉన్నవి ఏం చేపలు అని అక్కడ పని చేసే వారిని ప్రశ్నించగా, ఒక ఎకరం చెరువులో క్యాట్ఫిష్ వేస్తే మరో ఎకరంలో పాంగాసియస్ రకాలు పెంచుతామని వారు చెప్పారు.
చెరువులో కోడి వ్యర్థాలు
ఇందారంలో చెరువు వద్ద కోడి వ్యర్థాలను తరలించే వాహనం
చికెన్ వ్యర్థాలు తెగ ఛీప్..
సాధారణంగా చేపలకు జొన్న, మొక్కజొన్నతో పాటు పలు రకాల పిండి, ప్రభుత్వం ఆమోదించిన గుళికలను దాణాగా వేస్తారు. కానీ తక్కువ ఖర్చతో ఎక్కువ దిగుబడి సాధించాలనే దురాశతో కుళ్లిన చికెన్, చికెన్ వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారు. దాణా వేస్తే లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. అదే చికెన్ వ్యర్థాలైతే సగం ఖర్చులో అయిపోతుంది. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండం నుంచి ఈ చెరువులకు చికెన్ వ్యర్థాలు సరఫరా అవుతున్నాయి. హాజీపూర్లోని చెరువుకు జైపూర్ మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలు ఓ ద్విచక్రవాహనంపై రెండు లేదా మూడు రోజులకోసారి వస్తున్నాయి. చికెన్ షాపుల్లో వ్యర్థాలు సేకరించే ఓ వ్యక్తి నేరుగా వీటిని దొనబండకు తీసుకువచ్చి ఇస్తున్నారు. ఇలా ట్రిప్కు రూ.500 నుంచి రూ.600 వరకు తీసుకుంటున్నాడు. ఇక ఇందారం చేపల చెరువుకు మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం నుంచి ఎక్కువ చికెన్ వ్యర్థాలు వస్తున్నాయి. నమస్తే తెలంగాణ చెరువును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు రెండు ట్రక్కులు, వాటిలో చికెన్ వ్యర్థాలను తరలించే పెద్ద డ్రమ్ములు సైతం కనిపించాయి. దాణాలో చికెన్ను కలిపి వేసే యంత్రాలు, ఇతర సామగ్రి అక్కడ ఉన్నాయి. ఈ చెరువులకు అర కిలోమీటర్ దిగువకు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేప పిల్లల పంపిణీ పథకానికి సరఫరా చేసే చేపపిల్లలు పెంచే చెరువులు ఉండడం గమనార్హం.
గోదావరి, చెరువులోకి కలుషిత నీరు..
ఇందారంలోని చెరువుల్లో చేపలు పెంచిన నీటిని కాలువల ద్వారా నేరుగా గోదావరిలోకి పంపిస్తున్నారు. దొనబండ చేపల చెరువుకు పక్కనే ఉన్న ఊర చెరువు నుంచి మోటార్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని మార్చాల్సి వచ్చినప్పుడు చేపలు పెంచిన వ్యర్థపు నీటిని పొలాల్లోకి వదలడం లేదా మోటార్ పెట్టి తిరిగి చెరువులోకి పోయడం చేస్తున్నారు. దీంతో గోదావరి, స్థానిక చెరువుల్లోకి చేపలపై సైతం ఈ ప్రభావం పడుతున్నది. కుళ్లిన కోడి మాంసం తిని చేపలు విషతుల్యంగా మారుతున్నాయి.
ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
కోళ్లు వేగంగా బరువు పెరిగేందుకు కొలిస్టిన్ ఇంజక్షన్లు ఇస్తారు. తద్వారా ఆరు నెలల్లో ఎదగాల్సిన కోడి 45 రోజుల్లోనే కిలోన్నర నుంచి రెండు కిలోల బరువు వస్తుంది. దీంతో వాటి మాంసంలో స్టిరాయిడ్స్, హైమెటల్స్ ఎక్కువగా ఉంటాయి. చేపలకు దాన్ని మనం ఆహారంగా ఇవ్వడంతో అవి చేపల లోపలికి వెళ్లి త్వరగా ఎదుగుదల కనిపిస్తుంది. దాన్నే మనం ఆహారంగా తీసుకుంటే ఆ ప్రభావం కిడ్నీల మీద తీవ్రంగా పడుతుంది. వేడి ఎక్కువగా ఉండే మన ప్రాంతంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వచ్చి త్వరగా పాడైపోతాయి. ఒకసారి కిడ్నీ పోయిదంటే లివర్ కూడా పాడవుతుంది. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరానికి సరిపడా కాల్షియం సరఫరా కాక ఎముకలు బలహీన పడుతాయి. లోయర్ బ్యాక్పెయిన్ వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందుకే కోళ్ల వ్యర్థాలతో పెంచిన చేపలు ఆహారం కాదు.. విషం అంటున్నారు వైద్యులు. ఊరి చెరువులు, గోదావరిలో పెరిగిన చేపలు తినడం అన్ని విధాలా మంచిదని చెబుతున్నారు.
ఇక్కడి చేపలు ఇతర రాష్ర్టాలకు..
కోళ్ల వ్యర్థాలతో పెంచిన ఈ చేపలు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రామగుండం, గోదావరిఖని మార్కెట్లలో విక్రయానికి తరలిస్తున్నారు. తాజా చేపలు అంటూ విక్రయిస్తున్నారు. దొనబండ చెరువులో పెంచిన చేపలను మంచిర్యాల, ఆసిఫాబాద్లోని వ్యాపారులకు విక్రయిస్తామని ఆ చెరువు నిర్వాహకులు తెలిపారు. ఇందారం నుంచి చేపలు స్థానిక మార్కెట్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, బంగ్లాదేశ్కు వెళ్తున్నాయి.
గతంలోనే తీరు మార్చుకోమని చెప్పాం
గతంలో చికెన్ వ్యర్థాలను చేపలకు దాణాగా వేసినట్లు వెలుగులోకి రావడంతో విజిలెన్స్ ఆఫీసర్లు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇందారం, దొనబండలో చేపలు పెంచే వారు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లే. తీరుమార్చుకోవాలని గతంలో చెప్పాం. మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కాకపోతే ఈ విషయంలో మాతో పాటు కాలుష్య నియంత్రణ, గ్రామ పంచాయతీలు కూడా ఒకేసారి స్పందించాలి.
– సత్యనారాయణ, జిల్లా ఫిషరీస్ అధికారి, మంచిర్యాల