న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan).. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె వేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై లీగల్ కేసు ఉన్న నేపథ్యంలో ఫామ్26 ప్రకారం మీనాక్షీ నామినేషన్ను తిరస్కరించారు. అయితే అత్యవసర పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో నామినేషన్ల పత్రాలను తిరస్కరించిన కేసుల్లో ఎప్పుడైనా కోర్టు జోక్యం చేసుకున్న తీర్పులు ఉన్నాయా అని సుప్రీంకోర్టు మీనాక్షీ లాయర్ను ప్రశ్నించింది. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, దాని పరిష్కారం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆ సూచన చేసింది. ఆ నిర్ణయం ఎంత తప్పైనా కానీ, ఒకసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, దానికి పరిష్కారం అక్కడే ఉంటుందని కోర్టు చెప్పింది. ఇలాంటి కేసులు గతంలో ఉన్నాయా, వాటి పట్ల ఏదైనా తీర్పు ఉందా అని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్ల శిక్ష పడితేనే అప్పుడు సమాచారాన్ని వెల్లడించాలని, కానీ ప్రస్తుత కేసులో కేవలం సమన్లు మాత్రమే జారీ చేశారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
తప్పుడు పద్ధతిలో మధ్యప్రదేశ్ రిట్నరింగ్ అధికారి రాజ్యసభ నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు సింఘ్వీ పేర్కొన్నారు. కానీ మీనాక్షీ నటరాజన్ అసంపూర్ణ పత్రాలను సమర్పించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ పేర్కొన్నారు. ఫామ్ 26లో కోర్టు ఫిర్యాదు గురించి వెల్లడించలేదని ఆర్వో చెప్పారు. తెలంగాణలో రిజిస్టర్ అయిన కేసును మీనాక్షీ తన అఫిడవిట్లో పొందుపరచలేదని మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
మీనాక్షీ రిట్ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఆ పిటీషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. నామినేషన్ తిరస్కరణ అంశంలో ఆర్టికల్ 32 ప్రకారం చర్యలు తీసుకోవాలని మీనాక్షీ తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో ఎన్నికల పిటీషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీం సూచించింది. ఈ కేసులో ఎటువంటి మెరిట్స్ లేవని ధర్మాసనం పేర్కొన్నది.