Vishwas Kumar | జ్ఞాపకాలు మనిషికి స్వాంతననివ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటే మనసు పులకరించి పోవాలి. కానీ, కొన్నిసార్లు కొందరి జీవితాల్లో జ్ఞాపకాలు పీడకలలుగా మిగిలిపోతాయి. నిరంతరం వేధిస్తుంటాయి. తాను అలాంటి బాధనే అనుభవిస్తున్నానని సరిగ్గా సంవత్సరం క్రితం విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్(39) చెప్తున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనతో ముక్కలైన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకోవడానికి ఇప్పటికీ పోరాడుతున్నానని తెలిపాడు.
ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆందోళన, నిద్రలేని రాత్రులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని విశ్వాస్ కుమార్(Vishwas Kumar Ramesh)అన్నారు. గతేడాది జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో (Ahmedabad) కూలిపోయిన ఏఐ-171 విమాన(AI-171 plane) ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్. విమానం కూలిపోయి నేటికి సంవత్సరం పూర్తవుతున్నా నాటి ఆ భయానక జ్ఞపకాలు తనను నిరంతరం వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. నిత్యం ప్రమాదం జరిగిన సంఘటనలే కళ్లే ముందే కదులాడుతుండటంతో ఆందోళనకు గురై నిద్రకు దూరమయ్యానని పేర్కొన్నాడు.
ప్రజలు నేను ప్రమాదం నుంచి బయట పడిందే చూస్తున్నారని కానీ, నాలుగు గోడల మధ్య నిరంతరం నేను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను చూడటం లేదని వాపోయాడు. ఈ ప్రమాదంలో తన 35 ఏళ్ల సోదరుడు అజయ్ను కోల్పోయినట్లు తెలిపారు. ఈ కష్ట కాలంలో తన కుటుంబ సభ్యులు, మిత్రులు అందించిన సహకారం మరిచిపోలేనిదన్నారు. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చివరి దశకు చేరుకుందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ పేర్కొన్నారు.