నిర్మల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో బుధవారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్న పత్రాల లీకేజీలతో బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. మంగళవాం పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీలో ప్రశాంత్ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతనికి బీజేపీ అధ్యక్షుడు సంజయ్తో పాటు రాజ్యసభ్య సభ్యుడు కే లక్ష్మణ్, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తేలిందన్నారు.
వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీజేపీ నేతల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారని తెలిపారు. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రదారి ప్రశాంత్, తన ఫోన్ నుంచి బండి సంజయ్కు వాట్సప్ ద్వారా ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలు జరుగలేదన్నారు. రాష్ట్రం లో ఎన్నికలు సమీపిస్తుండడంతో అలజడి సృ ష్టించి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రం కు ట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్ర భుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. మొన్న టీఎస్పీఎస్సీ పేప ర్, నిన్న పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతల తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆత్మీయ సమ్మేళనాలకు అపూర్వ ఆదరణ..
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పార్టీ శ్రేణులతో పాటు, స్థానిక ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయంగా పలుకరించుకొని సాధక బాధకాలను పంచుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 7 నుంచి నిర్మల్లో జరుపుకుంటున్నామని, పార్టీ కౌన్సిలర్లు సంఘటితంగా ఉండి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నాయకులు ధర్మాజీ రాజేందర్, కోటగిరి అశోక్, పాకాల రాంచందర్, ముడుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.