తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లెలు, పట్టణాల్లో మంచినీళ్ల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. మిషన్ భగీరథపై ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీలు తీశారు. కళాకారులు ఆటాపాటలతో అలరించారు. ట్యాంకుల వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొని, పథకం గురించి వివరిస్తూ.. ప్రతిజ్ఞ చేయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు.
దిలావర్పూర్, జూన్ 18 : తెలంగాణ అవతరణ దశా బ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంచినీళ్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ఊరూరా ర్యాలీలు తీస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మిషన్ భగీరథ ఆవశ్యకతను వివరిం చి, ప్రతిజ్ఞ చేయించారు. ముగ్గుల పోటీలు నిర్వహిం చి విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాడెగాం గ్రామంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో జరిగిన వేడుకలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు భగీరథ నీటిశుద్ధి గురించి వివరించారు. ఆర్వో డబ్బాల్లో నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు, మిషన్ భగీరథ నీరు తాగడం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు వస్తున్నారంటే మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారని, కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు.
కడెం, జూన్ 18 : మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో నీళ్ల పండుగను ఘనంగా ర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ముఖ్య అతిథిగా హాజరై మిషన్ భగీరథ ప్లాంట్ను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనం పెట్టారు.
భైంసా, జూన్ 18 : పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మిషన్ భగీరథ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
బేల,జూన్ 18 : బేలలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజలు చేశారు. మిషన్ భగీరథ నీటి ప్రాముఖ్యతపై వివరించారు. గ్రామస్తులు ర్యాలీ తీస్తూ.. నినాదాలు చేశారు.
గుడిహత్నూర్, జూన్ 18 : గుడిహత్నూర్ మండల కేంద్రంలో సర్పంచ్ జాదవ్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ దవాఖాన నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
హాజీపూర్, జూన్ 18 : గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో మిషన్ భగీరథ ఆధ్వర్వంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగకు కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) రాహుల్, మిషన్ భగీరథ ఈఈ అంజన్రావుతో కలిసి హాజరయ్యారు. ఉదయం గ్రామాల్లోని ఓహెచ్ఆర్ ట్యాంక్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
మంచిర్యాల అర్బన్, జూన్ 18 : పట్టణంలోని వైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూస్కూరి రాంమోహన్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్ ప్రారంభించారు. నటరాజు విగ్రహానికి పూలమాలలు వేశారు. పలు మండలాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి.
ఆసిఫాబాద్, జూన్ 18 : మానిక్గూడలోని మిషన్ భగీరథ ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన మంచినీళ్ల పండుగలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సకు, కోనేరు కోనప్ప, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవ్ రావ్, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్బాజ్పాయిలతో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతి సారథి ఆధ్వర్యంలో కళాకారులు మిషన్ భగీరథపై పాటల రూపంలో వివరించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావ్ ఉన్నారు.