తాండూర్ : పెంచిన డీజిల్ ధరలను ( Diesel Prices ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ చార్జీలు పెంచడం వల్ల ఆటో డ్రైవర్ల ( Auto Drivers ) బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం తాండూర్ మండల కేంద్రం ఐబీలో ఆటో కార్మికులతో కలిసి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు డీజిల్ ధరలు పెంపుతో ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయిందన్నారు.
సింగరేణి సంస్థకు, ఆర్టీసీ సంస్థకు ఎలాగైతే సబ్సిడీ ఇస్తున్నారో అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా డీజిల్ ధరలో రాయితీ కల్పించాలని కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే జీఎస్టీలను తగ్గించి రాయితీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేల్పుల శంకర్, తాండూరు మండల ఆటో కార్మికులు పాల్గొన్నారు.