జైనూర్, డిసెంబర్ 20: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు. ఆటోలకు గిరాకీ తగ్గిందంటూ రోడ్డుపై బైఠాయించారు. మండల కేంద్రంలో సుమారు 100 ఆటోలతో భారీ ర్యాలీ తీశారు. తమ ఉపాధిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల శాఖ అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్, ఉపాధ్యక్షుడు టీ జగన్నాథ్, మెస్రం నారాయణ్, ఆడె రవి, సయ్యద్ దావుద్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల అటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ ఎస్పీఎం కాలనీ, డిసెంబర్ 20 : కాగజ్నగర్ పట్టణంలో బుధవారం ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. కాగజ్నగర్ పట్టణంలోని లారీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫైనాన్స్లో కొన్న ఆటోలకు నెలనెలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. సర్కారు స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.