నిర్మల్ అర్బన్, మార్చి 3: నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని 42 వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి శివారు వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగకపోగా బల్దియా పాలన తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లాంటి మౌలిక వసతులు లేకపోవడంతో మురుగునీటి కుంటల మధ్య జీవనం సాగించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. జౌళినాల పరిసర కాలనీల్లో పూడికతీత చేపట్టకపోవడంతో వర్షాకాలంలో మురుగు నీరు ఇండ్లలోకి చేరుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసి పట్టణాన్ని ప్రగతి పథంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నూతన పాలక వర్గంలోనైనా పట్టణ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాలి.
నిర్మల్లో మొత్తం 42 వార్డులు ఉండగా వాటిలో దాదాపు 30కి పైగా మురుగు వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కాలనీలు మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. పాత వార్డుల్లో ఉన్న సీసీ రోడ్లు, మురుగు కాలువలు అనేక ఏళ్ల క్రితం నిర్మించబడినవిగా ఉండటంతో మరమ్మతులు చేయాల్సి ఉంది. శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దిగువ ప్రాంతాల్లో నీటి కుంటలను తలపిస్తోంది. దీంతో దోమలు, పందులు విస్తరిస్తూ వ్యాధుల భయం నెలకొంది.
నిర్మల్ మున్సిపాల్టీలో దాదాపు లక్షా ఇరవై వేల జనాభా, దాదాపు 30 వేల నివాస సముదాయాలు ఉన్నాయి. శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీ, సోఫినగర్, విశ్వనాథ్పేట్, గాజుల్పేట్, రాంనగర్, గొల్లపేట్, మహాలక్ష్మీ వాడ, డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాలు లేవు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధులను ప్రధానంగా శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి వినియోగించి పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నూతన పాలకవర్గాన్ని ప్రజలు కోరుతున్నారు.