హజీపూర్, ఏప్రిల్ 22: మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆదివారం రాత్రి అవసరమైన సామగ్రి కొనేందుకు కళాశాల నుంచి బయటికి వచ్చారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ ఇద్దరు యువకులు బైక్పై వచ్చి విద్యార్థుల ముందు కట్ కొట్టుకుంటూ వెళ్లారు. ‘మా ముందు నుంచి అంత స్పీడ్గా ఎందుకు కట్ కొడుతూ వెళ్తున్నారు’ అంటూ ఆ యువకులను విద్యార్థులు ప్రశ్నించారు.
‘ఇది మా ఊరు రోడ్డు.. మీరు ఇక్కడి నుంచి నడవొద్దు’ అంటూ వైద్య విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేశారు. ఘటనలో ఓ విద్యార్థికి గాయాలైనట్లు తెలిసింది. వెంటనే వైద్య విద్యార్థులు డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో వైద్య విద్యార్థులు భయపడుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే క్యాంపస్ నుంచి బయటికి వెళ్లక తప్పదని, ఇలాంటి పరిస్థితుల్లో బయటివెళ్లాలంటేనే భయమోస్తుందని వాపోతున్నారు.
వైద్య కళాశాల హాస్టల్లో ఉండే విద్యార్థిని, విద్యార్థులతో పాటు అందులో పని చేసే సిబ్బంది నిత్యం మెయిన్ రోడ్డు నుంచి కళాశాలకు వస్తూ వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలకు వెళ్లిరావాలంటే భయంగా ఉందంటూ పలువురు వాపోతున్నారు. ఈ విషయంతో కళాశాలలో సంప్రదించగా గొడవ జరిగిన విషయం వాస్తవమని, స్థానికులతో మాట్లాడుతున్నామని భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ కిరణ్కుమార్ను వివరణ కోరగా.. డయల్ 100కు కాల్ చేశారని, కానీ మీము వెళ్లేలోపే అక్కడ ఎవరూ కనిపించలేదన్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని, ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.