ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 10: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు ఆరోగ్య లోపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. వారికి అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, డీఈవో పార్శి అశోక్, సింగిల్ విండో చైర్మన్ అలి బిన్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్, అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, అదనపు డీఎంహెచ్వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.