ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆజ్మీరా శ్యాంనాయక్పై 22,810 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు.. బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పపై 3,088 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక కాంగ్రెస్కు జిల్లాలో చోటు దక్క లేదు.
నియోజకవర్గంలో 2,26,664 ఓటర్లుండగా, 1,83,534 మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఇందులో కోవలక్ష్మికి 83,052 ఓట్లు రాగా, ఆజ్మీరా శ్యాంనాయక్కు 60,242 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి కోవలక్ష్మి ఆధిక్యం ప్రదర్శించారు. మొదటి రౌండ్లో 779, రెండో రౌండ్లో 457,మూడో రౌండ్లో 1184, నాలుగో రౌండ్లో 2740, ఐదో వ రౌండ్లో 1876, ఆరో రౌండ్లో 1197, ఏడో రౌండ్లో 297, ఎనిమిదో రౌండ్లో 507, తొమ్మిదో రౌండ్లో 4574, పదో రౌండ్లో 1817, పదకొండో రౌండ్లో 1266, పన్నెండో రౌండ్లో 2421, పదమూడో రౌండ్లో 1025, పద్నాలుగో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 596 లీడ్ వచ్చింది.
పదిహేనో రౌండ్లో మాత్రం కాంగ్రెస్కు 1189 లీడ్లో వచ్చింది. పదహారో రౌండ్లో మళ్లీ బీఆర్ఎస్కు 952 లీడ్ వచ్చింది, పదిహేడో రౌండ్లో కాంగ్రెస్కు 592, పద్దెనిమిదో రౌండ్లోనూ కాంగ్రెస్కు 10 లీడ్ వచ్చింది. మళ్లీ పందొమ్మిదో రౌండ్లో బీఆర్ఎస్కు 2343, 20వ రౌండ్లో 515, 21వ రౌండ్లో 455, 22వ రౌండ్లో కాంగ్రెస్కు 33 లీడ్ వచ్చింది. చివరి రౌండ్కల్లా మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి 22,810 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆసిఫాబాద్ గడ్డపై గులాబీ గుబాళించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. కౌంటింగ్ కేంద్రం నుంచి ప్రధాన వీధులగుండా కోవలక్ష్మి ఇంటి వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. చిల్డ్రన్పార్కులో కోవలక్ష్మి తండ్రి మాజీ మంత్రి కోట్నాక భీంరావు, కుమ్రం భీం విగ్రహాలకు, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కార్యకర్తలు డీజే పాటలతో నృత్యాలు చేశారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. కోవలక్ష్మి,ఆత్రం సక్కు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో దాదాపుగా 15 వేల మంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను ప్రదర్శించారు.
సిర్పూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పాల్వయి హరీశ్బాబు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోనేరు కోనప్పపై 28 వేల ఓట్లతో తేడాతో ఓటమి పాలయ్యారు. 2023లో బీజేపీ నుంచి పోటీ చేసిన హరీశ్ స్వల్ప మెజార్టీతో గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి తెలిపారు. ఫలితాల విడుదల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనకు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, మొదటిసారి 2014లో 19 వేల మెజార్టీతో గెలిపించానని, రెండోసారి 171 ఓట్ల తేడాతో ఓటమి చెందానని చెప్పారు. మూడోసారి అత్యధికంగా 22,810 మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ సేవ చేసుకుంటానన్నారు.
ఎమ్మెల్యే ఆత్రం సక్కు, చెల్లె మర్సుకోల సరస్వతి కృషి మరువలేనిదన్నారు. నా గెలుపు కోసం రాత్రీ.. పగలూ కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు, అభిమానులను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు.