కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈ ఏడాది మార్చినెలాఖరుకల్లా 1048 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది రైతులతో 129 ఎకరాల్లో మాత్రమే తోటలు సాగు చేయించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వంద శాతం టార్గెట్ను పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు అమలు చేసినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కష్టంగామారింది. అధికారులు తోటలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కేసీఆర్ సర్కారు జిల్లాలో ఆయిల్ పాం తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. రైతులను నష్టాలు లేని సాగువైపు మళ్లించేందుకు ఆయిల్ పాంలను పెద్ద మొత్తంలో విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. మాట్రిక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంతోపాటు మొక్కల సరఫరాలో రైతులకు సబ్సిడీని అందించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులకు మొక్కలను సరఫరా చేసేందుకు మంచిర్యాల జిల్లాలోని భీమారంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 213 ఉండగా, రూ. 193 సబ్సిడీని అందించారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న రైతులకు రూ. లక్ష విలువగల డ్రిప్లను అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 23 మంది రైతులకు డ్రిప్లను ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో ఇవ్వగా, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్లను అందిస్తూ ప్రోత్సహించింది. దీంతో రైతులు ఆయిల్పాం సాగుకు ముందుకు వచ్చారు. ఇంతలో ఎన్నికలు రావడం.. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయిల్పాం తోటల విస్తరణ సందిగ్ధంలో పడింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
మార్కెట్లో ఆయిల్ పాంకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చేపట్టిన ప్రాథమిక సర్వేల ప్రకారం జిల్లాలో సుమారు 3 వేల ఎకరాలు ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 1048 ఎకరాల్లో తోటలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విడుతల వారీగా ఆయిల్ పాం తోటలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇప్పటికే 129 ఎకరాల్లో విస్తరించారు. మార్చిలోగా టార్గెట్ పూర్తిచేసేందుకు రైతులకు అవగాహన కల్పించి భూములను సిద్ధం చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఆయిల్పాం సాగుకు బ్రేక్ పడింది.