కాసిపేట, జనవరి 28 : మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు తుది దశకు చేరుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దేవాపూర్ ఓరియంట్ కంపెనీకి సంబంధించి ప్రధాన ఐదు యూనియన్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగుల ఓటరు లిస్ట్ను యూనియన్లకు అందించారు.
మొత్తం 270 మందితో కూడిన ఓటరు జాబితాను యూనియన్లకు అందించారు. 10 రోజుల్లో ఓటరు లి స్ట్పై అభ్యంతరాలుంటే దరఖాస్తులు అందించాలని యూనియన్లకు సూచించారు. ఓటరు లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాత సమావేశం నిర్వహించి యూనియన్ల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేసే అవకాశముంది. ఓరియంట్ కంపెనీకి సంబంధించి మొత్తం 10 యూనియన్లు ఉండగా, పోటీలో ఉండే ఐదు యూనియన్లు సమావేశంలో పాల్గొన్నాయి.
ఇప్పటి వరకు నిర్వహించిన రెండు సమావేశాల్లో అన్ని అంశాలు చర్చించి.. శనివారం నిర్వహించిన మూడో సమావేశంలో ఓటరు లిస్ట్ను అందించారు. ఓటరు లిస్ట్ అభ్యంతరాలను పూర్తి చేశాక, ఫైనల్ చేసి ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల నాయకులు ఏనుగు తిరుపతిరెడ్డి, సత్యపాల్రావు, సతీశ్ రెడ్డి, భీంరావు, సూరు పాల్గొన్నారు.