ఆసిఫాబాద్ టౌన్, మార్చి 9: జిల్లా కేంద్రంలోని సందీప్నగర్ శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉపవాస దీక్షలు చేసిన భక్తులకు శనివారం అన్న ప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రామగిరి ఆశోక్ తెలిపారు. ఇక్కడ కమిటీ సభ్యులు రాపర్తి కార్తీక్, రాపర్తి శంకర్, అక్కు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలివేరు వెంకన్న, గంధం శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
కెరమెరి, మార్చి 9: మండల కేంద్రంలోని నెహ్రూనగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అన్నదానం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఉంటూ రాత్రంతా భజన, కీర్తనలు చేస్తూ దేవున్ని స్మరించుకున్నారు. ఉదయం స్నానాలు ఆచరించిన అనంతరం శివాలయంతో పాటు వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు.
పెంచికల్పేట్, మార్చి 9: మండల కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డు సమీపాన పంచకళాపుర క్షేత్రంలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా రెండోరోజు భద్రకాళి అమ్మవారు భక్తులకు దివ్యదర్శనిమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు మూలమఠం శివప్రసాద్స్వామి ఆధ్వర్యంలో భద్రకాళి, వీరభద్ర స్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, ముడుపులతో మొకులు చెల్లించారు. భక్తులకు రేణిగుంట్ల సంతోష్, ధనలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్ఐ కొమురయ్య ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
కౌటాల, మార్చి 9: మండల కేంద్రంలోని సదాశివపేట శివాలయ క్షేత్రంలో శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య, సంతోష్ ఆధ్వర్యంలో శివ పార్వతుల కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. స్వయంభూ వెలసిన కంకాలమ్మ గుట్టపై ఆలయ కమిటీ చైర్మన్ సులువ కనకయ్య ఆధ్వర్యంలో హోమం, శివపార్వతుల కల్యాణం, రామాలయంలో హోమం, కల్యాణం, తాటిపల్లి కుర్తా వద్ద గల వార్దా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దత్తు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తాటిపల్లి వార్దా నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఎడ్ల బండ్లపై తరలి వెళ్లారు. కౌటాల ఎస్ఐ మధుకర్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దహెగాం, మార్చి9: లగ్గాం ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో శనివారం బోనాల వేడుకలు నిర్వహించారు. భక్తులు భాజాభజంత్రీలతో ఆలయ పూజారి శ్రీకాంతాచారి ఆధ్వర్యంలో శివపార్వతులకు బోనాలు సమర్పించారు. శివరాత్రి మరుసటి రోజు బోనాల వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
చింతలమానేపల్లి, మార్చి 9 : మహహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు శనివారం ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు. కర్జెల్లి ముసలమ్మ గుట్ట శివాలయంతో పాటు ఆయా ఆలయాల్లో కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.
కాగజ్నగర్ టౌన్, మార్చి 9 : ఈస్గాం శివమల్లన్న ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఈస్గాం శివమల్లన్న జాతర శనివారం ముగిసింది. ఉదయం ఆలయంలో సుప్రభాతం, రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, మహాహారతి, ద్వారబంధనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వల్లు బండపై నాణేలను నిలిపి కోరికలు నెరవేరి ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, ఉత్సవ కమిటీ చైర్మన్ మురళీధర్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐలు నాగరాజు, సాధిక్పాషా, ఎస్ఐలు రామన్కుమార్, సనత్రెడ్డి, రమేశ్ బందోబస్తు చేపట్టారు.
బెజ్జూర్, మార్చి 9 : మండల కేంద్రంలోని శివాలయంతో పాటు రగనాయక, బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. బీజేపీ నాయకులు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు సబ్ కమిటీలుగా ఏర్పడి వలంటీర్లుగా విధులు నిర్వహించారు.