మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 26 : పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్కు చేరుకొని ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి మాట్లాడుతూ అంగన్వాడీ హెల్పర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. అంగన్వాడీ హెల్పర్లు వేమునూరి నిర్మల, అమృత, స్వాతి మాట్లాడుతూ 20 ఏళ్లుగా అంగన్వాడీ హెల్పర్లుగా పని చేస్తున్నామని, గత ప్రభుత్వం పదో తరగతితో ప్రమోషన్లు ఇచ్చిందని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ అర్హత పెట్టడం సరికాదని, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది అంగన్ వాడీ హెల్పర్లు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్వర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాశ్, అంగన్ వాడీ యూనియన్ జిల్లా నాయకులు, హెల్పర్లు విరోనిక, రాజేశ్వరి, స్వరూప, స్వాతి, లావణ్య, మధులత, అనూష, పద్మ, స్రవంతి, కౌసల్య, మీనాక్షి, శారద పాల్గొన్నారు.