‘వారసత్వంగా వచ్చిన ఆస్తులున్నాయ్.. తమ తల్లిదండ్రులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తే చాలు.. మాకేమిటి..? మేము ఉద్యోగం, ఇతర పనులు చేయకున్నా ఏమీ కాదు’ అనుకుంటూ ఎందరో మంది యువకులు బలాదూర్గా తిరుగుతున్నారు. ఇలాంటి రోజుల్లోనూ నిత్యం శ్రమను నమ్ముకొని ఏళ్ల తరబడి సింగరేణిలో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారు, ఆరోగ్యం సహకరించక మెడికల్ ఆన్ఫిట్ అయ్యి తమ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం ద్వారా తమ వారసులకు అప్పగించిన వారున్నారు. తదనంతరం ఆరోగ్యం కుదటపడిన పలువురు కార్మికులు కులవృత్తులు చేసుకుంటూ, ఇతర పనులకు వెళ్తున్న వారున్నారు. శ్రమను నమ్ముకోగా వచ్చి డబ్బులతో పాటు సంస్థ నుంచి వచ్చే పింఛన్తో వారసులపై ఆధారపడకుండా జీవిస్తున్న వారున్నారు. అలాంటి అ‘విశ్రాంత’ శ్రామికులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.. -భూపాలపల్లి, నవంబర్ 27
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో పనులు చేస్తున్నారు. ఇంకొందరు పలు ప్రైవేట్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు చికెన్, పాన్, హోటల్, కిరాణం వంటివి సొంతంగా పెట్టుకొని అదనంగా సంపాదిస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వారిలో ఎక్కువ మంది తమ కుల వృత్తులనే చేస్తున్నారు. కొందరు పట్టణాల్లో, మరికొందరు తమతమ సొంతూళ్లలో వారికి వచ్చిన పనులు చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్నారు.
బెల్లంపల్లి, నవంబర్ 27 : సింగరేణి నౌకరీ దిగిపోయినంక ఐదేండ్లు ఖాళీగానే ఉన్నా. ఎలాగైనా సరే ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉండాలని అనుకున్నా. సింగరేణి కాలరీస్ కన్నాల నీలగిరి ఫారెస్ట్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా. మందమర్రి ఏరియా సోమగూడెం-3 ఇైంక్లెన్లో కోల్కట్టర్గా 1970లో నౌకరీలో చేరా. ఒకే గనిలో నా సర్వీస్ మొత్తం పూర్తయ్యింది. 2002లో రిటైర్ అయ్యా. నాకు ప్రస్తుతం 75 యేండ్లు. 15 యేండ్ల నుంచి ఈ కొలువు చేస్తున్నా. నాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. కొడుకు వెంకటేశ్కు మేము భారం కాకుండా నా జీతం డబ్బులతో చేదోడు వాదోడుగా ఉంటున్నా.
– రెమ్మ మల్లేశ్, రైల్వే రడగంబాల బస్తీ, బెల్లంపల్లి
బెల్లంపల్లి, నవంబర్ 27 : మా సొంతూరు బెల్లంపల్లి మండలం మాలగురిజాల. మా ఊరి నుంచే సింగరేణి ఉద్యోగం చేసే వాడిని. శాంతిఖని గనిలో 1986లో కోల్ పిల్లర్గా పనిలో చేరా. కొన్నేండ్ల తర్వాత శాంతిఖనిలోనే ఉంటున్నా. మందమర్రి ఏరియా కాసిపేట-1వ గనిలో 2018లో రిటైర్డ్ అయ్యా. నాకు నలుగురు కుమారులు. ఒకరు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం, మరొకరు బ్యాంకు మేనేజర్, ఓరియంట్లో భార్యాభర్తలు ఉద్యోగులు. సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నారు. అందరూ ఉన్నత ఉద్యోగులు. అయినా సరే నా కాళ్ల మీద నేను నిలబడాలని వాళ్ల నుంచి ఏమీ ఆశించకుండా కర్ర బిజినెస్ చేస్తున్నా. నాకు 63 యేండ్లు. నీలగిరి, సుబాబుల్ చెట్ల కర్రలను సిర్పూర్ పేపర్ మిల్లుకు విక్రయించి జీవనం సాగిస్తున్నా.
– చాపిడి లక్ష్మణ్, మాల గురిజాల, బెల్లంపల్లి
బెల్లంపల్లి, నవంబర్ 27 : నాకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఉద్యోగ విరమణ కాకముందు ఒక కొడుకు, తర్వాత చిన్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద కుమారుడి ఇద్దరు కుమారుల (మనవల) బాధ్యత కూడా నాపైనే పడింది. ఐదుగురు కుమార్తెల్లో నలుగురికి వివాహం కాగా, చిన్నకూతురు చదువుకుంటున్నది. నాకు 63 యేండ్లు. 1985లో అప్పటి బెల్లంపల్లి ఏరియా గోలేటి-1 గనిలో మేషన్ ఉద్యోగం చేసే వాడిని. 2020లో గోలేటి టౌన్షిప్ సివిల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ విరమణ పొందా. రిటైర్డ్ అయినప్పటి నుంచి మేషన్ మేస్త్రీగా వెళ్తున్నా. నాకు వచ్చే సింగరేణి పింఛన్తో పాటు మేషన్ మేస్త్రీకి వచ్చే కూలితో నా కూతురు, నా మనవళ్లను చదివించుకుంటూ పోషిస్తున్నా.
– గూడెపు కిష్టయ్య, 24 డిప్ ఏరియా, బెల్లంపల్లి
నేను భూపాలపల్లిలో కేటీకే ఐదో బాయిలో ట్రామర్గా పనిచేశా. నౌకరీ చేస్తున్నప్పుడే నాకు గుండె జబ్బు వచ్చింది. రెండు స్టంట్లు పడ్డాయి. సీఎం కేసీఆర్ సర్ కల్పించిన ఆవకాశంతో నాలుగేండ్ల కింద మెడికల్ అన్ఫిట్ అయ్యా. నా ఉద్యోగం కారుణ్యం కింద నా కొడుకుకు వచ్చింది. మందులు వాడడంతో ఆరోగ్య కుదుటపడింది. మేము రజకులం. కొత్తగూడెంలో ఉద్యోగం చేసినప్పుడు బట్టలు ఇస్త్రీ చేసిన. కాళ్లు రెక్కలు ఆడినంత సేపు సొంతంగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతేనే మంచిది. నాకు రూ.14 వేల పింఛన్ అత్తది. ఖాళీగా ఉండడం ఎందుకని భూపాలపల్లిలో షాపు పెట్టి బట్టలు ఇస్త్రీ చేత్తున్న. ఇవో నెలకు రూ.9వేల వరకు వత్తాయి. మాకు మేం సొంతంగా బతుకుతున్నాం.
– పొత్కపెల్లి కొమురయ్య, మెడికల్ అన్ఫిట్ కార్మికుడు, భూపాలపల్లి
రామకృష్ణాపూర్, నవంబర్ 27: నా సంతానంపై ఆధార పడకుండా సొంత సంపాదనతో బతకడంలోనే మాకు ఆనందంగా ఉంది. నేను సింగరేణి సంస్థలో 36 యేండ్ల పాటు ఆర్కే-1 మొదలు వివిధ గనుల్లో పనిచేశా. 2012లో కేకే-5 గనిలో విరమణ పొందా. నాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. ఉద్యోగంలో ఉండగానే అందరికీ పెండ్లి చేసిన. 2013లో విఠల్నగర్లోని రిటైర్డ్ ఉద్యోగుల కాలనీలో సొంతిల్లు కట్టుకున్న. మూడేండ్ల తర్వాత ఇంటి ముందటనే ఒక టేలా వేసుకొని నడుపుకుంటున్నా. సొంతంగా ఇంటి ఖర్చులకు సంపాదించుకుంటున్న. సింగరేణిలో ఉద్యోగ విరమణ అనంతరం వస్తున్న పింఛన్ డబ్బులు, టేలా నడిపితే వచ్చిన లాభంతో నేను, నా భార్య యేసమ్మ జీవనం సాగిస్తున్నాం. నాకు 71 ఏండ్లు. ఈ వయస్సులోనూ పిల్లల సంపాదనపై ఆధార పడకుండా చేతనైనంత వరకు సొంతంగా జీవించాలని అనుకుంటున్న.
– మడ్లపెల్లి మల్లయ్య, రిటైర్డ్ ఉద్యోగుల కాలనీ, రామకృష్ణాపూర్