ఎదులాపురం, ఏప్రిల్ 12 : ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ జిల్లా నాయకుల వ్యవహార శైలి, సిద్ధాంతాలు నచ్చక యువకులు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీ కేవలం ధనికుల పార్టీ అన్నారు. దేశంలో రూ.19 లక్షల కోట్లను అంబాని, అదాని, నీరావ్ మోదీ తదితరులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పలు చెల్లించకపోవడంతో వారి బ్యాంక్ అకౌంట్స్ ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) ఉండడంతో ఆస్తులను జప్తు చేయక అప్పుల మొత్తాన్ని మోదీ, అమిత్షా మాఫీ చేశారన్నారు.
ప్రజల సొమ్మును ఎగ్గొట్టిన వారికి మోదీ, అమిత్షా లీడర్లని అన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ దేశ, దైవ భక్తి ఉంటుందని, కానీ బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటే సరిపోతుందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు గణేశ్, దయాకర్, సాగర్, విక్రమ్, అమోల్, అనిల్, జై జవాన్ నగర్కు చెందిన 40 మంది యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి
దేశానికి దశ, దిశ చూపిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, పట్టణంలో ఆయన విగ్రహావిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ, జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. వేడుకల నిర్వహణ వివరాలను దుర్గం శేఖర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 13న, 14న నిర్వహించే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కమిటీ గౌరవాధ్యక్షుడు మేకల మల్లన్న, బాబాసాహెబ్ కాంబ్లే, మల్యాల స్వామి, కో కన్వీనర్లు శైలందర్ వాగ్మారే, శాలిక్ రావు నగరాడే, రత్నజాడే ప్రజ్ఞకుమార్, సోగల సుదర్శన్, రామ్ చందర్ మహాత్మే, శోభాబాయి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, బాలశంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 12 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అధికారులతో కలిసి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న సాయంత్రం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. విగ్రహావిష్కరణకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరానున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.