నిర్మల్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భరోసానిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం వివరాలు వెంటనే పంపించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నలుగురు కలెక్టర్లను ఆదేశించిందన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా రూపొందించే పనుల్లో అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు రాగానే నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందజేస్తామన్నారు. జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మె ల్సీ కవితపై ఈడీ ధారుణంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. గంటల పాటు, రోజుల తరబడి వి చారణ పేరిట వేధింపులకు పాల్పడడం శోచనీయమన్నారు. 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం లో పాల్గొని, బతుకమ్మకు ప్రపంచస్థాయిలో గు ర్తింపు తెచ్చిన తెలంగాణ ఆడబిడ్డ కవితపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్న బీజేపీ నాయకుల కుట్రలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ప్రధాని మోదీపై పోరాటం చేస్తున్నందువల్లనే ఇక్కడి నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదని, కనీసం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్ట పరిహారాన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఉండడంతో ఆ రాష్ర్టానికి ఇటీవలే రూ.985 కోట్లను ఇచ్చిందన్నారు. ఎన్నికలు ఉంటే ఒక తీరు.. లేకుంటే మరో తీరు అన్నట్లు కేంద్ర బీజేపీ తయారైందని దుయ్యబట్టారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం నయా పైసా ఇవ్వకపోయినా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉన్నదని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజల మనసు గెలుచుకుంటామన్నారు.
23నుంచి ఆత్మీయ సమ్మేళనాలు….
ఈ నెల 23నుంచి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలను జరుపుకుంటామని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేల సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటికే 53వేల మెంబర్షిప్ ఉందని, దీనిని మరింత పెంచేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చించుకొని, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో చర్చించుకుంటామని తెలిపారు. పార్టీ శ్రేణులకు సమస్యలుంటే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి, రాజకీయంగా భరోసానివ్వడానికి ఈ సమ్మేళనాలను పార్టీ నిర్వహిస్తున్నదని తెలిపారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటన..
వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ నిర్మల్లో పర్యటించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నిర్మల్లో పూర్తయిన సమీకృత కలెక్టరేట్, చించోలి సమీపంలో నిర్మించిన మైనారిటీ ఎడ్యుకేషన్ హబ్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. అలాగే కొండాపూర్ వద్ద నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఇక్కడి ప్రజలకు మరిన్ని వరాలను కురిపిస్తారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు రాంకిషన్రెడ్డి, రఘునందన్రెడ్డి, ధర్మాజీ రాజేందర్, పాకాల రాంచందర్, లక్ష్మణచారి, సుభాష్రావు, గంగారెడ్డి, పార్టీ పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.