నిర్మల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : 40 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని, ఓట్ల కోసమే సభ నిర్వహించారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో అధికారికంగా 13 మంది, అనధికారికంగా 250 మంది వరకు చనిపోయారన్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. ఈ సంఘటన జరిగి 40 ఏళ్లు గడిచినా నేటికీ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు అది మరువని జ్ఞాపకమని గుర్తు చేశారు. మంగళవారం నిర్మల్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షు లు విఠల్రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవలి ఇంద్రవెల్లి పర్యటనతో హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు ఆదివాసులను పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం గిరిజనుల ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో రేవంత్రెడ్డి సభ పెట్టారని ఆరోపించారు. ఈ సభలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను దూషించడానికే రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యతనిచ్చారని, సీఎం మాట్లాడిన భాషపై చిన్న పిల్లలు, మహిళలు అసహ్యించుకుంటున్నారన్నారు. తమ ప్రాంతానికి సీఎం వస్తే అభివృద్ధి జరుగుతుందని, నిధులు మంజూరు చేస్తారని ఆదివాసులు అంతా ఆశించారని, వారి ఆశలను వమ్ము చేస్తూ గిరిజనుల అభివృద్ధికి సీఎం నయా పైసా మంజూరు చేయలేదని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలోనే గిరి గూడేల్లో ప్రగతి
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చి ‘మా ఊళ్లో-మా రాజ్యం’ నినాదాన్ని సాకారం చేశామన్నారు. విద్య, వైద్యం, రవాణ సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా.. మారుమూల పల్లె బడుల్లో ఆంగ్ల విద్యను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు. కేసీఆర్ హయాంలోనే జోడేఘాట్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. రూ.25 కోట్లతో కుమ్రం భీమ్ స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియం.. జోడేఘాట్కు వెళ్లేందుకు రూ.15.95 కోట్లు వెచ్చించి రెండు వరుసల రహదారిని నిర్మించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యం మనం చూసిన కలరా, మలేరియా, విషజ్వరాలను మెరుగైన వైద్య సదుపాయంతో అరికట్టిన సంగతి ప్రతి గిరిజన బిడ్డకు తెలుసన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుని పోడు భూముల సమస్యను కేసీఆర్ ప్రభుత్వమే పరిష్కరించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా భూములకు పట్టాలిచ్చిందన్నారు.
45 రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పు;విఠల్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే తలమానికంగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. గత 45 రోజల కాంగ్రెస్ పాలనలో రూ.14 వేల కోట్లు ఎందుకు అప్పు చేయాల్సి వ చ్చిందో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చె ప్పాలని డిమాండ్ చేశారు. ఈ 45 రోజుల్లో పేర్లు మార్చడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చే యలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలోనే నాగోబా ఆలయానికి రూ.6 కోట్లు
ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ నిర్మాణాని కి కేసీఆర్ ప్రభుత్వమే రూ. 6 కోట్లను మంజూరు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి ఇం ద్రవెల్లికి వచ్చి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదివాసులకు నిరాశే మిగిలిందన్నారు. ఇంద్రవెల్లిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించడమే తప్ప అభివృద్ధికి నయాపైసా కేటాయించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకున్న ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం శో చనీయమన్నారు. కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని తిట్టడానికే ఇంద్రవెల్లికి వచ్చావా?అని సీఎం రేవంత్ను ప్రశ్నించా రు. ప్రజలు అవకాశం ఇచ్చారు. గత కేసీఆర్ పాలన కంటే మెరుగ్గా ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నా రు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, నాయకులు రాంకిషన్రెడ్డి, మారుగొండ రాము, రాంచందర్, నర్సాగౌడ్ పాల్గొన్నారు.
మున్యాల గొండు గూడెం, మల్లాపూర్, భూత్కుర్, చెన్నూర్ గ్రామాలకు చెందిన మెస్రం వంశీయులు మంగళవారం ఎడ్ల బండ్లు, కాలి నడకన కేస్లాపూర్లోని నాగోబా మహాపూజకు బయలుదేరారు.