పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి డాక్టర్ కావాలనేది ఒక కల. చదువున్నా ఆర్థికంగా లేకపోవడంతో వారి ఆశ నెరవేరిది కాదు. వారి ఆశయానికి రూపం ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైద్య చరిత్రలో నూతన శకానికి నాంది పలుకుతూ.. నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేసి సకల సౌకర్యాలు కల్పించారు. కాలేజీకి వంద చొప్పున 200 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా.. అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వీటికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి రాగా.. ప్రొఫెసర్లు కూడా నియామకం అయ్యారు. నేడు (శుక్రవారం) సీఎం కేసీఆర్ ఈ కళాశాలలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు హాజరవుతుండగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాకేంద్రంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
– నిర్మల్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ)
నిర్మల్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో వైద్యరంగానికి మహర్దశ చేకూరనుంది. సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషి మేరకు గతేడాది మెడికల్ కాలేజీ మం జూరైంది. ఈ యేడాది ఎంబీబీఎస్ తరగ తుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్ర శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చారు. కాగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. రాష్ట్ర కోటాలో 85 సీట్లు, ఆలిండియా కోటాలో 15 సీట్లకు వైద్యవిద్యార్థులను కేటాయించారు. నేటి (శుక్రవారం) నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు మొదలు కానున్నాయి. దీనికి సీఎం కేసీఆర్ శుక్రవారం ఈ మెడికల్ కాలేజీని అధికారికంగా హైదరాబాద్ నుండే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ హాజరు కానున్నారు.
ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిం చనున్నారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలు పునిచ్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు వైద్యవిద్య చేరువైందంటున్నారు. అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులు, ప్రొఫెసర్లు అందుబాటులోకి రానున్న కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది. ఈసారి జరిగిన ఎంబీబీఎస్ అడ్మిషన్లలో నిర్మల్ ప్రాంతానికి చెందిన చాలా మంది విద్యార్థులు నీట్ ద్వారా మెరుగైన ర్యాంకులు సాధించి, ఇక్కడే సీట్లు దక్కించుకోవడం ఈ ప్రాంతానికే గర్వకారణంగా నిలుస్తున్నది. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ఆసిఫాబాద్లోని బాబాపూర్ సమీపంలో నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. కాలేజీకి 100 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతుండడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులకు హాస్టల్ వసతితోపాటు లైబ్రరీని అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రూ.1000 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు కావడంతో నిర్మాణమైంది. ప్రభుత్వం ఇటీవలే 26 మంది ప్రొఫెసర్లను కూడా కేటాయించింది. శుక్రవారం మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తుండడంతో తరగతులు మొదలు కానున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం హాజరు కానున్నారు. ఉదయం 4 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరి 9 గంటలకు ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలకు చేరుకొని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం కార్యరూపం దాలుస్తున్నది. రాష్ట్రలో కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది మెడికల్ కాలేజీలను శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇది వైద్య చరిత్రలోనే ఒక రికార్డు. ఇందులో నిర్మల్ మెడికల్ కాలేజీ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేటు స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. ఆర్థికంగా పేదలకు మేలు జరుగుతుంది. అలాగే పేద కుటుంబాల్లో డాక్టర్ కావడం అనేది ఒక కల. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అవకాశాలు పెరగడమే కాకుండా, ఉచితంగా ‘డాక్టర్’ పట్టా అందుకునే అవకాశం కలిగింది.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి.