రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
మంచిర్యాలలో రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్సీ విఠల్కు ఆత్మీయ సన్మాన మహోత్సవం
మంచిర్యాల అర్బన్ / రామకృష్ణాపూర్, జూన్ 10 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నదని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంచిర్యాల సమీపంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరు కాపు సంఘం నాయకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ను మున్నూరు కాపులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. అన్ని కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఓ వైపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు కులవృత్తులను నమ్ముకొని జీవించే వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాపులను ఎవరు పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అన్ని ప్రముఖ పదవుల్లో కాపులకు అవకాశం ఇస్తున్నారని, ఇందుకు కాపు బిడ్డను రాజ్యసభకు పంపించడమే నిదర్శనమన్నారు.
కష్టపడే వారికి గుర్తింపు : ఎంపీ రవిచంద్ర
రాష్ట్రంలో పార్టీ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడే వారందరికీ గుర్తింపు ఉంటుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. టీఆర్ఎస్లో ఉన్నవారంతా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం శ్రమించేవారేనని కొనియాడారు. రెండు జిల్లాల కాపు నేతలంతా ఒక్కటై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
బాధ్యత మరింత పెరిగింది : ఎమ్మెల్సీ విఠల్
సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించి తనపై మరింత బాధ్యత పెంచారని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపులకు ఎలాంటి సమస్యలున్నా తనకు తెలియజేస్తే, పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరు కాపులందరూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్తో పాటు మంత్రి కమలాకర్ను గజమాలలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు దివాకర్ రావు (మంచిర్యాల), దుర్గం చిన్నయ్య(బెల్లంపల్లి), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, ఆకుల సత్తన్న, గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, మంచిర్యాల మున్నూరు కాపు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు బొలిశెట్టి రాయలింగు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజక వర్గం జనరల్ సెక్రటరీ ఇప్ప రమేశ్, బోయిడి రవీందర్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మంచిర్యాల 16వ వార్డు కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ పోరెడ్డి రాజు, మాజీ కౌన్సిలర్ పడాల రామన్న, నాయకులు పడాల రవీందర్, ఆరె శ్రీనివాస్ పాల్గొన్నారు.