ఎదులాపురం,ఆగస్టు 4: మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. 2021-23కు సంబంధించిన మద్యం దుకాణాల నిర్వహణ నవంబర్ 30న పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 40 దుకాణాలు ఉన్నాయన్నారు. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు-5, గౌడ్కులస్తులకు-1, ఎస్టీలకు 9 కేటాయించినట్లు తెలిపారు. 21 ఏళ్లు దాటినవారు తమకు వీలైనన్ని దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల చొప్పున చలాన్ లేదా డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
లక్కీ డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వాటిని నిర్వహించే అవకాశం దక్కతుందన్నారు. 21న స్థానిక రత్న గార్డెన్స్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుడితో పాటు వెంట వచ్చే వారికి ప్రత్యేక పాస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాస్ ఉన్నవారికే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు ్ల పూర్తి చేస్తున్నామని వివరించారు. దరఖాస్తులు స్వీకరణకు నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఉదయం 11 నుంచి సా యంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పా రు. అలాగే హెల్ప్ డెస్క్ సెంటర్ 08732 220076 ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ ,ఇచ్చోడ, ఉట్నూర్ సీఐలు సీహెచ్ శ్రీనివాస్, రాజమౌళి, మహేందర్ సింగ్ ఉన్నారు.
స్టేషన్ల వారీగా& ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 18, ఇచ్చోడ -13, ఉట్నూర్ 9(ఏజెన్సీ) ఉన్నాయన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో తిర్పెల్లిలో (గౌడ్స్), ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ (ఎస్సీ),ఆదిలాబాద్లోని వడ్డెరకాలనీ (ఎస్సీ), ఆదిలాబాద్ జిల్లా బేలమండలం (ఎస్సీ), ఆదిలాబాద్ జిల్లా భీంపూర్(ఎస్సీ), ఇచ్చోడ మండలం గిర్నూర్(ఎస్సీ)లకు కేటాయించారు. ఉట్నూర్ 9 ఏజెన్సీకి కేటాయించగా, మిగిత 25 జనరల్కు కేటాయించారు.
నిర్మల్ టౌన్/ నిర్మల్ అర్బన్,ఆగస్టు 4 : జిల్లాలోని 48 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా ఇన్చార్జి అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 4నుంచి 18 వరకు జిల్లాలోని 48 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 5, బీసీలో 5 రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు. మద్యం షాపు టెండర్కు గాను ఒక్కో దరఖాస్తుకు రూ. 2లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందని వించారు. జిల్లా కార్యాలయంతో పాటు నాంపెల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. ఈనెల 18 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 21న కలెక్టర్ సమక్షంలో లక్కీడ్రా ద్వారా షాపుల కేటాయింపు ఉంటుందన్నారు. నేర చరిత్ర ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. సమావేశంలో భైంసా, నిర్మల్ సీఐలు సంపత్కృష్ణ, నజీర్ హుస్సేన్ పాల్గొన్నారు.