ఇంద్రవెల్లి, జూలై4: ఏటా ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో అకాడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ పూజలు చేస్తే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మ కం. మండలంలోని శంకర్గూడ, ఇంద్రవెల్లి గోం డ్గూడ, వడగాం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో మంగళవారం వనదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా మొక్కులు చెల్లించారు.
వనదేవత ముందు వ్యవసాయ పనిముట్లు, అడవి బర్రెల కొమ్ము లు పెట్టి అకాడి పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. ముందుగా గ్రామ పోలిమేరలోని పోచమ్మతల్లికి పూజలు చేశారు. అనంతరం గిరిజనులు సహపంక్తి భోజనం చేశారు. గ్రామంలోని పశువులను అడవి ప్రాంతంలో వనదేవత చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. గ్రామాల్లో చేను కలుపు పనులు, దండారీ నృత్యాలకు శ్రీకారం చుడుతున్నట్లు గిరిజన పెద్దలు తెలిపారు.